Rajasthan Polls: పైలట్ దెబ్బ-రాజస్తాన్ లో కాంగ్రెస్ ను గుజ్జర్లు ముంచబోతున్నారా ?
రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో గెలిచేందుకు గుజ్జర్లు కూడా తోడయ్యారు. అప్పటికే గుజ్జర్ల రిజర్వేషన్ సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వారు.. సచిన్ పైలట్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అలాగే సచిన్ పైలట్ సీఎం అవుతారని కూడా ఆశించారు. కానీ అలా జరగలేదు. మధ్యప్రదేశ్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కు అండగా నిలవడంతో సచిన్ పైలట్ సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సచిన్ పైలట్ మొహం చూసి 8 సీట్లలో కాంగ్రెస్ కు గుజ్జర్లు పట్టం కట్టారు. బీజేపీని ఈ 8 సీట్లలో ఓడించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 11, బీజేపీ 10 మంది గుజ్జర్లకు టికెట్లు ఇచ్చాయి. అయితే సచిన్ పైలట్ ను సీఎం చేయకపోవడం, ఇతరత్రా కారణాలతో గుజ్జర్లు కాంగ్రెస్ కు దూరమవుతున్నారు. ఈ ప్రభావం ప్రస్తుతం గెహ్లాట్ కేబినెట్లో ఉన్న గుజ్జర్ల సామాజిక వర్గ మంత్రులపై పడుతోంది. దీంతో సచిన్ పైలట్ కూ, గెహ్లాట్ కూ మధ్య అధిష్టానం మరోసారి రాజీ కుదిర్చింది.

అయినా కాంగ్రెస్ పార్టీ తమ నేత సచిన్ పైలట్ కు అన్యాయం చేసిందని భావిస్తున్న గుజ్జర్లు ఈసారి ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే గుజ్జర్లతో పాటు కాంగ్రెస్ కు అండగా నిలిచిన ముస్లింలు, ఎస్టీలు కూడా రాష్ట్రంలో తమపై జరుగుతున్న దాడుల విషయంలో గెహ్లాట్ సర్కార్ నిర్లిప్త ధోరణిపై ఆగ్రహంగా ఉన్నారు. వీరంతా కలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీని ముంచేలా కనిపిస్తున్నారు.
మరోవైపు ఇదే అదనుగా బీజేపీ తిరిగి గుజ్జర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో గుజ్జర్ల రిజర్వేషన్ హింసకు కారణంగా విమర్శలు ఎదుర్కొన్న మాజీ సీఎం వసుంధరా రాజేను వారి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దూరంగా ఉంచుతోంది. అలాగే అలాగే గతంలో జరిగిన పరిణామాల్ని మర్చిపోయి గుజ్జర్లు తమకు మద్దతిస్తారని బీజేపీ ఆశాభావంగా ఉంది. ప్రధాని మోడీని రంగంలోకి దింపడం ద్వారా గుజ్జర్లతో పాటు ఇతర వర్గాల్ని కూడా గంపగుత్తగా తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications