జయ చేతిలో అవమానం, అప్పుడే..: రజినీకాంత్ను దేవుడు శాసించాడా?
రజనీకాంత్ ఎప్పటికప్పుడు రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇస్తూ, ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నారు. ఈసారి ఆయనను దేవుడు శాసించాడా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
చెన్నై: తాను రాజకీయాల్లోకి వస్తానని, పార్టీ పెడుతానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. కానీ రాజకీయాల్లోకి రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అలా అనుకుంటున్నారు.
తమిళనాడు పరిస్థితులు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. గత 21 ఏళ్ల కాలంలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. 1999లో వచ్చిన ముత్తు సినిమాలోని డైలాగును కూడా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతంగానే భావించారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన ప్రతిసారీ మీడియా విస్తృతమైన ప్రచారం కలిగించడం, తమిళనాడు రాజకీయాలు వేడెక్కడం, ఆ తర్వాత చల్లారడం సర్వసాధారణమైంది. ఇప్పుడు కూడా రజినీకాంత్ అదే పనిచేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

ఆ వ్యాఖ్య చేసినందుకు...
రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోతున్నాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఆ దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని చెన్నైలో గురువారం అభిమానుల సమావేశంలో రజనీకాంత్ చెప్పారు. అంతే కాకుండా యుద్ధం కోసం మీ విధులు మీరు నిర్వహించండని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. దేవుడు రజనీకాంత్ను శాసించాడని, యుద్ధమంటే ఎన్నికలని భావిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అనుకుంటున్నారు.

పరిస్థితులను పసిగట్టారా...
పరిస్థితులను పసిగట్టి, అంచనా వేసుకుని రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారని చెప్పడానికి వీలవుతోంది. జయలలిత మరణం తర్వాత సంభవించిన పరిణామాలే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణమని అంటున్నారు. అన్నాడియంకె చీలిక, తమిళనాడులో సంక్షోభం సద్దుమణగకపోవడం ఆయన రాజకీయాల్లోకి రావడానికి అనువైన పరిస్థితులను కల్పించాయని అంటున్నారు. అంతేకాకుండా, డిఎంకె కురువృద్ధుడు ఎం. కరుణానిధి క్రియాశీలక రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం కూడా ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు.

అప్పుడే ఆలోచన వచ్చిందట...
జయలలిత చేతిలో అవమానం జరిగినప్పుడే రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. 1995లో ఓ సంఘటన ఆయనకు అవమానకరంగా తోచింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఉంటున్న పోయెస్ గార్డెన్ నివాసానికి సమీపంలోనే రజనీకాంత్ నివాసం కూడా ఉంది. జయలలిత పస్తున్నారని ఆ రోడ్డులో ఓ రోజు పోలీసులు ట్రాఫిక్ను నిలిపేశారు. దాంతో రజనీకాంత్ గంటసేపు కారులోనే కూర్చుండిపోయి, ఆ తర్వాత అసహనంతో కారు దిగి నడక ప్రారంభించారు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆలోచన వచ్చిందని అంటున్నారు. ఆయన వెంట చాలా మంది నడిచారు.

అది జరిగిన తర్వాత...
తనకు అవమానం జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇంటిపై దాడి జరిగింది. బొంబాయి సినిమా విడుదలైన కొత్తలో ఆ సంఘటన జరిగింది. ఆ విషయంపై రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని తప్పు పట్టారు. దానిపై జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె తీవ్రంగా మండిపడింది. ఆయనను విమర్శిస్తూ పోస్టర్లు వేసింది. దీంతో 1996 ఎన్నికల్లో జయలలితను గెలిపిస్తే తమిళనాడును ఎవరూ రక్షించలేరని విమర్శించారు.

ఏకం చేసింది ఆయనే...
జయలలితపై ఆగ్రహంతో ఉన్న రజనీకాంత్ 1996 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేశారు. జయలలితను ఓడించాలనే లక్ష్యంతో కరుణానిధి నాయకత్వంలోని డిఎంెకను, జికె ముపనార్ నాయకత్వంలోని తమిళ్ మనిల కాంగ్రెసను ఏకం చేసి పొత్తు కుదిర్చారు. అప్పుడు డిఎంకె కూటమి ఘన విజయం సాధించింది. డిఎంకె విజయానికి రజనీకాంత్ కారణమనే అబిప్రాయం బలంగా ముందుకు వచ్చింది. ఆ విషయాన్ని ఆయన కూడా ఓ సందర్భంలో చెప్పుకున్నారు.

ముఖ్యమంత్రి అయ్యే అవకాశం....
ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రజనీకాంత్కు 1996లోనే వచ్చిందని చెబుతారు. జయలలితపై పోటీ చేయాలని ముపనార్ రజనీకాంత్ను అప్పట్లో కోరినట్లు సమాచారం. ఆ విషయాన్ని ముపనార్ గానీ, రజనీకాంత్ గానీ బయటకు చెప్పలేదు. 1996లోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రజనీకాంత్ వదులుకున్నారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఓ మీడియా కార్యక్రమంలో చెప్పారు. అప్పట్లో ముపనార్కు చిదంబరం సన్నిహితంగా ఉండేవారు. అందువల్ల రజినీకాంత్కు ముపనార్ ఇచ్చిన ఆఫర్ తెలిసే ఉంటుందని భావిస్తున్నారు.

రాజకీయాల్లోకి రానని ఎప్పుడూ చెప్పలేదు...
తాను రాజకీయాల్లోకి రాబోనని రజనీకాంత్ ఎప్పుడూ చెప్పలేదు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరిగినప్పుడు కూడా వాటిని కొట్టిపారేయలేదు. సమయం కోసం ఆయన వేచి చూస్తున్నట్లే అందరూ భావిస్తూ వస్తున్నారు. 2014లో నరేంద్ర మోడీ రజనీకాంత్ను కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, బిజెపిలో చేరుతారని విస్తృత ప్రచారం సాగింది. తమకు రజనీకాంత్ మద్దతు ఇచ్చారని లోకసభ ఎన్నికల్లో బిజెపి ప్రకటించుకుంది. అయితే, అటువంటిదేమీ లేదని ఆయన చెప్పేశారు.

సినిమా ప్రమోషన్ల కోసమేనా...
సినిమా ప్రమోషన్ల కోసమే తాను రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలిస్తూ ఆ తర్వాత వెనక్కి తగ్గడం చేసుకుంటూ పోతున్నారని, ఇది రజనీకాంత్కు అలవాటుగా మారిందని చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలివ్వడం, ఆ తర్వాత రాజకీయాల గురించి ప్రస్తావించకపోవడం అందుకు కారణం. ఇప్పుడు కూడా అలానే చేస్తారా అనే అనుమానాలున్నాయి. డిఎంకె నేత స్టాలిన్ను ప్రశంసించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తాను ఎటువైపు ఉండదలుచుకుందీ సంకేతాలు ఇచ్చారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇలా చేశారు...
ప్రతిపక్షాలను 1996లో గెలిపించింది తానే అని చెప్పుకున్న రజనీకాంత్ అది యాక్సిడెంట్ మాత్రమేనని అన్నారు. 2009లో జరిగిన శ్రీలంకలోని ముళ్లైవైకల్ ఊచకోత సంఘటనపై రజనీకాంత్ నోరు విప్పలేదు. దీనిపై తమిళ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. కమల్ హాసన్ వంటి సినీ ప్రముఖులు దాన్ని ఖండించారు. కావేరీ జల వివాదంపై కూడా ఆయన కచ్చితమైన అభిప్రాయాన్ని ప్రకటించలేదు. కానీ తమిళ అభిమానులను దృష్టిలో ఉంచుకుని, దాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఒక రోజు దీక్ష చేశారని అంటారు. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటకలో పెరిగినవాడిగా తమిళనాడుపై రజనీకాంత్కు అభిమానం లేదనే అభిప్రాయం ముదురుతుందనే ఉద్దేశంతో ఆ పని చేశారని కూడా అంటారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications