క్షమాపణకి రెడీ, ముఖం చూడొద్దు: ముస్లింలకి రాజ్నాథ్
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... తమ వల్ల గతంలో ముస్లింలకు ఏదైనా నష్టం వాటిల్లితే అందుకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని చెప్పారు.
బిజెపి ముస్లిం వ్యతిరేకి అన్న కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దన్నారు. తమ వల్ల ఎక్కడైనా, ఎప్పుడైనా ముస్లింలకు చెడు జరిగి ఉంటే తలవంచి క్షమాపణ వేడుకుంటామని చెప్పారు. దేశం కోసం ఈ ఒక్కసారి తమకు అవకాశమివ్వాలని కోరారు. మీ అంచనాలను అందుకోకపోతే, మరోసారి తమ ముఖాన్ని కూడా చూడవద్దని రాజ్నాథ్ అన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓటేయొద్దని, బలమైన జాతి నిర్మాణం కోసం, సోదర, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఓటేయండని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడు 2002 అల్లర్ల గురించే మాట్లాడుతుందని మండిపడ్డారు.
రాజ్నాథ్ సింగ్ 'మోడిత్వ-ది ఐడియా బిహైండ్ ది మ్యాన్' అనే పుస్తకాన్ని ఢిల్లీలోని చిన్మయ మిషన్ ఆడియోరిటంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవిష్కరించారు. ఈ సమయంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
2002లో గోద్రా అల్లర్లపై గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మీద ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications