Ranya Rao: కస్టడీలో శారీరకంగా వేధించారు.. రన్యారావు తీవ్ర ఆరోపణలు
Ranya Rao: బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు మరోసారి డీఆర్ఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు తనను చాలా సార్లు చెంపదెబ్బ కొట్టారని.. తనకు ఆహారం ఇవ్వలేదని.. ఖాళీ పత్రాలపై సంతకం చేయాలని బలవంతం చేశారని రన్యా ఆరోపించింది. డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ కు రాసిన లేఖలో.. రన్యా తాను నిర్ధోషినని ప్రకటించుకుని.. తనను తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు.
కన్నడ నటి, సీనియర్ పోలీసు అధికారి కుమార్తె రన్యా రావును మార్చి 4న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. ఆమె దుబాయ్ నుంచి 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించింది. ఈ బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. పరప్పర అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ కు రన్యా పంపిన లేఖలో.. తనను విమానం లోపల అరెస్ట్ చేసి వివరించడానికి అవకాశం ఇవ్వకుండా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. తనను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కోర్టులో హాజరుపరిచేవరకు శారీరకంగా హింసించారని.. అధికారులు తనను 1015 సార్లు కొట్టారని.. పదే పదే కొట్టినప్పటికీ వారు తయారు చేసిన స్టేట్మెంట్లపై సంతకం చేయడానికి తాను నిరాకరించినట్లు రన్యా వెల్లడించారు.

గతంలో కూడా ఆరోపణలు
అంతకు ముందు రన్యాను ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు రన్యాను అనేక ప్రశ్నలు అడిగింది. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అని కోర్టు ఆమెను ప్రశ్నించగా.. రన్యా కోర్టులోనే ఏడవడం మొదలుపెట్టింది. డీఆర్ఐ అధికారులు తనను మానసికంగా వేధించారని ఆరోపించింది. దీని తర్వాత కోర్టు రన్యాను వైద్య చికిత్స పొందారా అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను మానసిక వేధింపులను ఎదుర్కొన్నానని పేర్కొంది.
ఆరోపణలను తోసిపుచ్చిన డీఆర్ఐ
నటి రన్యారావు కోర్టులో హాజరైన సమయంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది డీఆర్ఐ అధికారులు అక్కడే ఉన్నారు. వారు రన్యా వాదనలను తోసిపుచ్చారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని, దర్యాప్తులో సహకరించడం లేదని ఆరోపించారు. కోర్టు విచారణ సమయంలో రన్యా రావును డీఆర్ఐ అధికారులు ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని దర్యాప్తు అధికారి న్యాయమూర్తికి తెలియజేశారు.












Click it and Unblock the Notifications