మిస్త్రీకి నో ఇంటర్వ్యూ: ఉద్వాసనపై స్పందించిన టాటా
ముంబై: సైరన్ మిస్త్రీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రతన్ టాటా నిరాకరించారు. మిస్త్రీ తొలగింపు కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో మిస్త్రీ ఉద్వాసనపై ఆయన స్పందించారు. బాంబే హౌస్కు వచ్చిన ఆయన ఆ విషయంపై మాట్లాడారు.
టాటా గ్రూపు కంపెనీలన్నీ తమ దృష్టిని మార్కెట్పైనే కేంద్రీకరించాలని రతన్ టాటా అన్నారు. లీడర్షిప్ మార్పు గురించి టాటా కంపెనీలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టాటా కంపెనీ చైర్మన్ హోదా నుంచి సైరస్ మిస్త్రీని తొలిగించిన నేపథ్యంలో ఆ సంస్థల అధినేత రతన టాటా తొలిసారి స్పందించారు.
త్వరలో శాశ్వత నాయకున్ని టాటా సన్స్ ఎన్నుకుంటుందని ఆయన అన్నారు. కొత్త చైర్మెన్ ఎన్నిక ప్రక్రియ కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని, మరో నాలుగు నెలల్లోగా టాటా సన్స్ కొత్త చైర్మన్ను ఎన్నుకుంటుందని రతన్ టాటా తెలిపారు.
కాగా, సైరస్ మిస్త్రీ తొలగింపు అకస్మాత్తుగా జరిగినట్లు అనిపించినప్పటికీ చాలా కాలంగానే ఆ విషయం నలుగుతున్నట్లు తెలుస్తోంది. మిస్త్రీకి, టాటాకు మధ్య విభేదాలకు మిస్త్రీ ఏకపక్ష నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. జపాన్ సంస్థ డొకొమోతో జరిగిన న్యాయపోరాటంలో టాటా సన్స్ ఓడిపోవడం, బ్రిటన్లోని స్టీల్ సంస్థను అమ్మేయడం మిస్త్రీపై వేటు వేయడానికి ప్రధాన కారణాలని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత కొంతకాలంగా రతన్ టాటాతో మిస్త్రీ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మిస్త్రీ.. టాటాను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే ఆయన సీటుకు ఎసరు తెచ్చింది. డొకొమోతో టాటా అర్ధంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకుగాను ఆ సంస్థకు 1.17 బిలియన్ డాలర్లు చెల్లించాలని లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ టాటా సన్స్ను గతంలో ఆదేశించింది. ఈ కేసులో మిస్త్రీ దాదాపు రతన్ టాటాను పూర్తిగా ముంచినంత పనిచేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి.
దానికి తోడు కీలక సంస్థలను అమ్మడం కూడా మిస్త్రీపై వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా యూకేలో టాటా స్టీల్ అమ్మకం మలుపు తిప్పింది. ఇక 2008లో కంపెనీ కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్కు పెట్టుబడులు తేవడంలోనూ మిస్త్రీ విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. యూకేలో రతన్ టాటా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేస్తే.. దానిని మిస్త్రీ పూర్తిగా కూలదోసే యత్నం చేశారన్న విమర్శ కూడా ఉంది.