బ్యాంకులకే డబ్బు.. ఏటీఎంలలో నో క్యాష్..
డబ్బును నేరుగా బ్యాంకులకే పంపించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు కొరత సామాన్యులకు దినదిన గండంగా పరిణమించిన సంగతి తెలిసిందే. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దేశంలో చాలావరకు ఏటీఎంలు నో క్యాష్ బోర్డుతోనే దర్శనమిస్తుండటంతో కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి.
తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి కష్టాలను రెట్టింపు చేసేలా మారింది. డబ్బును ఏటీఎంలకు కాకుండా బ్యాంకులకే పంపించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఏటీఎంలలో మరికొన్ని రోజుల పాటు నగదు అందుబాటులో ఉండదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.10లక్షల ఏటీఎంలు ఉండగా కేవలం 27వేల ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంటుంది.
గత నెలలో 30శాతం ఏటీఎంలలో డబ్బును నింపగా ప్రస్తుతం 13శాతం మాత్రమే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దీనిపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నోట్ల రద్దును అమలుపరిచి నెలరోజులు దాటిపోతున్నా.. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం సామాన్యుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.