Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘నీట్‌’పై రీజనల్ ఎఫెక్ట్: తెలుగు విద్యార్థులకు తీరని వ్యధ

నీట్‌లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటే మన విద్యార్థులు అందుకే నీట్‌లో టాప్‌–10లో నిలబడకపోవడానికి కారణాలివేనని సమాధానమిస్

హైదరాబాద్‌: నీట్‌లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రం తేలిగ్గా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అవగాహన లేకపోవడంతో సరిగ్గా అందుపుచ్చుకోలేదని, ఇంగ్లిష్‌లో ప్రశ్నాపత్రం కఠినంగా రావడంతో నష్టపోయారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

అన్ని జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటే మన విద్యార్థులు అందుకే నీట్‌లో టాప్‌-10లో నిలబడకపోవడానికి కారణాలివేనని సమాధానమిస్తున్నారు. తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది విద్యార్థులు నీట్‌ రాయగా వారిలో ఎంతమంది అర్హత సాధించారన్న సంగతి తేలలేదు.

ఐదు శాతం మంది మాత్రమే తెలుగులో రాశారని, 95 శాతం మంది ఇంగ్లిష్ లోనే పూర్తి చేశారు. లెక్కలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ పరీక్షలో మనోళ్లకు రావాల్సిన స్థాయిలో ర్యాంకులు రాలేదన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎంసెట్‌ రాసిన విద్యార్థులను నీట్‌ సిలబస్‌కు తగ్గట్టుగా సిద్ధం చేయలేకపోవడం దీనికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఎంసెట్‌లో లేని నెగిటివ్ మార్కులు నీట్‌లో ఉండటం వల్ల భారీగా నష్టపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య ప్రవేశాలకు నీట్‌ తప్పనిసరి చేయడంతో గతేడాది నుంచి ఎంసెట్‌ బదులు అదే పరీక్షను నిర్వహిస్తున్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు గతంలో ఆలిండియా ప్రీ మెడికల్‌ టెస్ట్‌ (ఏఐపీఎంటీ) ఉండేది. ఆ పరీక్షను మన విద్యార్థులు రాసేవారు కాదు. ఎంసెట్‌ రాసేవారు ఏఐపీఎంటీ రాయడానికి వీల్లేదు. దీంతో మన విద్యార్థులెవరూ ఏఐపీఎంటీ రాసేవారు కాదు. కానీ ఇతర రాష్ట్రాల విద్యార్థులు 15 ఏళ్లుగా ఆ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలోని ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు. ఏఐపీఎంటీ స్థానంలోనే ఇప్పుడు నీట్‌ వచ్చింది. కానీ ఈ పరీక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు.

పరీక్షల నిర్వహణలో మార్పు ఉంటుందా?

పరీక్షల నిర్వహణలో మార్పు ఉంటుందా?

మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్‌ విద్యను తీర్చిదిద్దలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను మార్చి తెలంగాణలో అదనంగా మరికొంత సిలబస్‌ చేర్చి విద్యార్థులపై భారం మోపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ తొలి సంవత్సరం పరీక్షలు ప్రాధాన్యం కాదు. రెండో ఏడాది పరీక్ష మాత్రమే ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుంది. కానీ తెలంగాణలో రెండేళ్ల పరీక్షలూ కీలకమే. దీంతో విద్యార్థులు నీట్‌పై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ కోర్సు కాలం ఎక్కువ. మే నెల మాత్రమే వారికి సెలవులు ఉంటాయి. మన రాష్ట్రంలో మాత్రం రెండున్నర నెలల సెలవులు ఉన్నాయి.

ఒక్క ప్రశ్న పోతే నాలుగు మార్కులు ఔట్

ఒక్క ప్రశ్న పోతే నాలుగు మార్కులు ఔట్

ఎంసెట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. కానీ నీట్‌లో ఉంటాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. అయితే ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే.. ఐదు మార్కులు పోతాయి. దీంతో సరైన ఆన్సర్‌ రాసినా తప్పుడు ఆన్సర్‌తో ఎక్కువగా నష్టపోయారని చెబుతున్నారు. ఇక ప్రాంతీయ భాషల్లో నీట్‌ పేపర్‌ ఈజీగా వచ్చింది. దీంతో గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు సహా అనేక ఇతర రాష్ట్రాలు లాభపడ్డాయి. హిందీలో కూడా నీట్‌ సులువుగానే వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో 95 శాతం మంది విద్యార్థులు నీట్‌ను ఇంగ్లిషులోనే రాశారు. తెలుగు భాషలో పేపర్‌ కాస్త సులువుగానే వచ్చినా కేవలం 5 శాతం మందే రాయడం, వారికి సరైన గైడెన్స్‌ లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది.

371 డీకి సవరణతోనే నేషనల్ పూల్ చాన్స్

371 డీకి సవరణతోనే నేషనల్ పూల్ చాన్స్

ప్రస్తుతం నీట్‌ ద్వారా ర్యాంకులు పొందిన తెలుగు విద్యార్థులు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్‌ కోటాలో మాత్రమే సీట్లు పొందడానికి వీలుంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వైద్య సీట్లు సాధించాలంటే నేషనల్‌ మెడికల్‌ సీట్ల పూల్‌లో చేరాల్సి ఉంటుంది. అందులో చేరాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. అలా చేరితే నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్‌ సీట్లలో 50 శాతం సీట్లను జాతీయ మెడికల్‌ సీట్ల పూల్‌ తీసుకుంటుంది. అలా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సీట్లకు నీట్‌ ద్వారా కేటాయిస్తుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, తెలుగు రాష్ట్రాలు మాత్రమే నేషనల్‌ పూల్‌లో లేవు. తెలంగాణ నేషనల్‌ పూల్‌లో చేరాలంటే 371డి ఆర్టికల్‌కు సవరణ చేయాలి. అందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. నేషనల్‌ పూల్‌లో చేరితే రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్‌ విద్యలో సంస్కరణలు తేకుండా చేరితే అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,050, ప్రైవేట్ మెడికల్‌ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. నేషనల్‌ పూల్‌లో చేరితే ప్రభుత్వ కాలేజీల్లో నిర్దేశిత సీట్లతోపాటు ప్రైవేట్ కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లల్లో 15 శాతం సీట్లు కూడా జాతీయ పూల్‌లోకి వెళ్తాయి.

నష్టపోయామంటున్న నిపుణులు

నష్టపోయామంటున్న నిపుణులు

నీట్‌ ద్వారా అర్హత పొందిన విద్యార్థుల ర్యాంకులను కేంద్రం త్వరలో ప్రకటించనున్నదని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. నేషనల్‌ పూల్‌లో మనం లేనందున మన సీట్లల్లో మన విద్యార్థులే చేరతారన్నారు. అందువల్ల నీట్‌లో మన విద్యార్థులు తక్కువ సామర్థ్యం చూపినా మనకు వచ్చే నష్టం పెద్దగా ఉండదని, అయితే ప్రైవేట్ మెడికల్‌ కాలేజీల్లోని బీ, ఎన్నారై కేటగిరీ సీట్లల్లో మాత్రం నీట్‌లో అర్హత పొందిన విద్యార్థులు ఎవరైనా వచ్చి చేరవచ్చునని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నీట్‌లో నెగెటివ్‌ మార్కుల వల్ల మన విద్యార్థులు నష్టపోయారని ప్రముఖ విద్యాసంస్థల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రం సులువుగా ఉండటం కూడా మన విద్యార్థులకు నష్టంగా పరిణమించిందంటున్నారు. తెలంగాణలో 1450 ర్యాంకు వరకు జనరల్‌ కేటగిరీలో ర్యాంకు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు రావొచ్చునని తెలిపారు. 480 మార్కులు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో, 440 మార్కులొస్తే ప్రైవేటులోని కన్వీనర్‌ కోటాలో సీటు రావొచ్చునని 400 మార్కులొస్తే బీ కేటగిరీలో సీటు దక్కవచ్చునని చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+