ఆరెస్సెస్కు సారీ: సుప్రీం కోర్టు సలహాను తిరస్కరించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) చంపిందన్న తన వ్యాఖ్యల పైన భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనను ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నాడు తిరస్కరించారు.
రాహుల్ గాంధీ పైన పరువు నష్టం దావా కేసు వేశారు. దీనిపై గురువారం నాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆర్ఎస్ఎస్కు క్షమాపణలు చెబితే కేసు విచారణతో పని ఉండదని రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది.

అయితే, సుప్రీం కోర్టు సలహాను ఆయన తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరెస్సెస్కు క్షమాపణలు చెప్పనని తేల్చేశారు. ఆ కేసులో వాదనకు తాను సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదిస్తున్నారు.
ఆయనే రాహుల్ గాంధీ తరపున కోర్టులో అభిప్రాయాన్ని వినిపించారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ కేసు విచారణ జరగనుంది. కాగా, గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘే కారణమంటూ గత ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త రాహుల్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.












Click it and Unblock the Notifications