పశ్చిమ బెంగాల్ కు పాకిన రైతుబంధు పథకం..! అమలు చేసేందుకు దీదీ సుముఖత..!!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ ముహూర్తంలో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారో తెలియదు కాని ఆ పథకం స్లో పాయిజన్ గా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆ పథకం గురించే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ పథకం గురించి లోతైన చర్చలు జరుపుతుంటే మరికొన్న రాష్ట్రాలు ఇదే పధకాన్ని అమలు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. రైతుబంధు పథకానికి ధీటుగా రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు కేంద్రం ఇటీవల పార్లమెంట్ స్ఠాండిగ్ కమిటీ సమావేశ పరిచి మద్దత్తు ధర పై సబ్సిడి ఇచ్చేందుకు మార్గ దర్శకాలను అన్వేషించింది. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేసి ఇదే పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. రైతుబంధు పథకం ప్రవేశ పెట్టి త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలను రాబట్టాలనుకుంటున్నారు మమత
లోక్సభ ఎన్నికలే లక్ష్యం..! రైతుబంధు పథకం పై మమత ఆశలు..!!
రైతుబందు.. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. రైతులకు నేరుగా ప్రయోజనాలను కట్టబెట్టడాన్ని వ్యతిరేకించే మోడీ కూడా ఈ పథకం అమలు తీరుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న చర్చ చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో గులాబీ పార్టీ విజయం సాధించడానికి రైతుబంధునే కారణమైంది. రైతులకు పెట్టుబడి సాయం కింద నేరుగా డబ్బులు ఇవ్వడమే ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం. రైతులకు పెట్టుబడి సాయం కింద సీజన్కు రూ.4వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. ఖరీఫ్లో నాలుగువేల రూపాయలు, రబీలో నాలుగువేల రూపాయల చొప్పున అందించింది.
రైతు బంధు, రైతు భీమా..! రెండు పథకాల పై మమత ఆసక్తి..!!
అలాగే రైతులకు 5లక్షల వరకు ఎల్.ఐ.సీ సహకారంతో భీమా చేయించింది. రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడం ద్వారా పశ్చిమబెంగాల్లోని రైతుల్లో క్రేజ్ తెచ్చుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని మమత యోచిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రధాని పీఠంపై కన్నేసిన మమత, ఈ సారి ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకుంటే తన మద్దతు కోరి వచ్చే పార్టీలతో ప్రధాని పదవికి పట్టుబట్టవచ్చని భావిస్తున్నారు. 42 ఎంపీ స్థానాల్లో 40 సీట్లు సాధిస్తే కేంద్రంలో కీలకపాత్ర పోషించవచ్చని మమత ఉద్దేశం.అందుకే రైతులను టార్గెట్గా చేసుకుని తెలంగాణలో హిట్ అయిన పథకాల అమలుకు నిర్ణయించారు.
ఏటా 5వేలు ఇచ్చేందుకు మమత రెడి..! రైతు భీమా చేయించేందుకు సిద్దం..!
ఇప్పుడు ఇదే పథకం పశ్చిమబెంగాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి మమతబెనర్జీ నిర్ణయించారు. జనవరి 1 నుంచి పథకం అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏడాదికి రూ.8వేలు ఇవ్వకపోయినా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలుగా మమతబెనర్జీ సర్కారు నిర్ణయించింది. ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ కోల్కత్తా వెళ్లి మమతాబెనర్జీని కలిశారు. ఈ సందర్బంగా రైతుబందు, రైతుబీమా పథకాలపై చర్చ జరిగింది.
బెంగాల్ లో క్రుషి క్రుషక్ బంధు గా నామకరణం..! పథకం పట్ల మమత సంత్రుప్తి....!
అయితే.. బెంగాల్లో రైతుబంధు పేరును కృషి కృషక్ బంధుగా నామకరణం చేశారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 5వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తుంది. మొదటి విడతగా 2500 రూపాయలు, రెండో విడతలో మరో 2500 రూపాయలు ఇస్తుంది. అలాగే 18-60ఏళ్ళ రైతులకు రెండు లక్షల రూపాయల జీవిత బీమా చేయించనుంది. దీనివల్ల పశ్చిమ్బెంగాల్లోని దాదాపు 72లక్షల మంది రైతులకు బెనిఫిట్ జరుగుతుందని మమత ప్రకటిండం విశేషం..!