ఆ ఆలయ వివాదం ప్రభావం చూపలేదు..మేమే గెలుస్తున్నామన్న కమ్యూనిస్ట్ నేత
తిరువనంతపురం: కేరళలో శబరిమల అంశం ఓట్ల సమయంలో ప్రభావం చూపలేదని అన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. ఈ లోక్సభ ఎన్నికల్లో కేరళలో తమదే విజయం అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో శబరిమల పేరుతో అల్లర్లు సృష్టించింది బీజేపీ పార్టీనే అని పినరాయి విజయన్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మీడియాతో పినరాయి విజయన్ మాట్లాడారు. కేరళలో తమ పార్టీ భారీ విజయం అందుకోబోతోందని జోస్యం చెప్పారు. ఇక్కడ దేవుని పేరుతో అలజడి సృష్టించింది ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసని విజయన్ అన్నారు.
శబరిమల పేరుతో అలజడి సృష్టించిన వారు ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారని విజయన్ గుర్తుచేశారు. అంతేకాదు వారిమధ్యే సఖ్యత లేదని వాళ్లలో వారే గొడవ పడుతున్నారని అన్నారు పినరాయి విజయన్. గతేడాది శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఇక గతేడాది అక్టోబర్ నెల నుంచి శబరిమల ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శబరిమలై లోకి ప్రవేశించాలని భావించిన మహిళలను అక్కడి భక్తులు, కొన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు నెలలకు 50 ఏళ్లకు తక్కువగా ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా వారిని భక్తులు అడ్డుకున్నారు.దీంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ ఏడాది మార్చిలో బీజేపీ కోజికోడ్ లోక్సభ అభ్యర్థి ప్రకాష్ బాబును అల్లర్లకు కారణంగా భావించి అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు.












Click it and Unblock the Notifications