సచిన్ కాంగ్రెసుకు ప్రచారం చేయడు: రాజీవ్ శుక్లా
కాన్పూర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయనున్నాడని వచ్చిన వార్తలను భారత క్రికెట్ నియంత్రమణ మండలి (బిసిసిఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజీవ్ శుక్లా ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున సచిన్ టెండూల్కర్ ప్రచారం చేస్తాడనే ప్రచారానికి ఆయన తెరదించారు. ఆ వార్తలన్నీ నిరాధారమని కొట్టిపారేశాడు.
కాన్పూర్ నుంచి ఆయన పిటిఐ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడారు. సచిన్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడంటూ వచ్చినవన్నీ ఊహాగానాలేనని, పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేశారు. టెండూల్కర్ క్రికెట్తో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారం ఎలా చేస్తాడని శుక్లా ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సచిన్ టెండూల్కర్ కాంగ్రెసు తరఫున ప్రచారం చేయవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. మీడియా కథనాలు తప్పు దారి పట్టిస్తున్నాయని, కాంగ్రెసుకు సచిన్ టెండూల్కర్ ప్రచారం చేయబోడని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రచారం చేస్తాడా అని అడిగితే భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేమని ఆయన సమాధానమిచ్చారు.
ప్రస్తుతం సచిన్ హర్యానాతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం వచ్చే నెలలో విండీస్తో రెండు టెస్టుల సిరీస్లో ఆడాల్సి ఉంది. ఆ సిరీస్తో సచిన్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే.