ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. అత్యాధునిక వైద్య సేవలను అందించారు. అయినప్పటికీ- ఫలితం రాలేదు.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ములాయం సింగ్ యాదవ్. దీన్ని గమనించిన డాక్టర్లు హుటాహుటిన ఐసీయూ నంబర్ 5కు తరలించారు. ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల కఠారియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. ములాయం సింగ్ యాదవ్ను ఐసీయూలోకి తరలించినట్లు సమాచారం అందిన వెంటనే కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్.. హుటాహుటిన మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు.
ములాయం సింగ్ యాదవ్కు ఇద్దరు భార్యలు. వారిద్దరూ మరణించారు. 2003లో ఆయన మొదటి భార్య మాలతీ దేవి కన్నుమూశారు. ఆ తరువాత సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాలేయ వ్యాధితో బాధపడిన సాధన గుప్తా ఇదే మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
కాగా- దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్కు మూడుసార్లు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1989, 1993, 2003లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్రమంత్రిగా వేర్వేరు శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత.. ఆయన దూరం అయ్యారు. అదే సమయంలో వయస్సు మీద పడటం, అనారోగ్యం చుట్టుముట్టడంతో పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.