ఈడీ వలలో మరో కీలక నేత: బీజేపీ మాజీ మిత్రపక్షం ఎంపీ అరెస్ట్: పొత్తులో ఉన్నప్పుడే?
ముంబై: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులను మరింత తీవ్రతరం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ ఈడీ దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు
దాడులు-అదుపు-అరెస్ట్
ఇప్పుడిక తాజాగా శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందే ముంబైలోని ఆయన నివాసం మైత్రీపై దాడులు సాగించారు. తెల్లవారు జాము నుంచీ విస్తృతంగా సోదాలను నిర్వహించారు. అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉండకపోవడంతో అరెస్ట్ చేశారు.
సమన్లు ఇచ్చినా..
పట్ర చాల్ భూ కుంభకోణం కేసులో ఇదివరకు ఈడీ అధికారులు సంజయ్ రౌత్కు రెండుసార్లు సమన్లను జారీ చేశారు గానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీనితో వారే స్వయంగా ఆయన నివాసంపై దాడులకు దిగారు. ఏడు గంటలకు పైగా సాగించిన విస్తృత సోదాలు, విచారణల అనంతరం అరెస్ట్ చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు సంజయ్ రౌత్. పట్ర చాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఇవ్వాళ కోర్టుకు..
సంజయ్ రౌత్ను అదుపులోకి తీసుకుని ఇంట్లోనే ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. పట్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఫిర్యాదులను తీసుకుని వారు సంజయ్ రౌత్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాను సంజయ్ రౌత్ ముందుంచారు. వాటికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇవ్వాళ ఆయనను న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరే అవకాశం ఉంది.
ఇరికించారు..
సంజయ్ రౌత్ను భారతీయ జనతా పార్టీ నాయకులు కుట్ర పన్ని అరెస్ట్ చేయించారని ఆయన సోదరుడు సునీల్ రౌత్ ఆరోపించారు. బీజేపీ-శివసేన పొత్తు ఉన్నప్పుడు లేని పట్ర చాల్ భూ కుంభకోణం ఇప్పుడెలా తెర మీదికి వచ్చిందని ప్రశ్నించారు. అరెస్ట్ చేసినట్లు తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని చెప్పారు. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న బీజేపీ నాయకులను ఈడీ అధికారులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
ఇదే కేసులో..
ఇదే కేసులో ఇదివరకు సంజయ్ రౌత్ సమీప బంధువు ప్రవీణ్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన భార్య వర్ష రౌత్కు చెందిన 11 కోట్ల రూపాయలను అటాచ్ చేశారు. మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 47 ఎకరాల స్థలంలో నిర్మించిన నివాసాలను రీ డెవలప్మెంట్ చేయాలనే పేరుతో సంజయ్ రౌత్, ప్రవీణ్ రౌత్, సుజిత్ పట్కర్ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.