బ్లాక్ మనీ: రూ. 30 లక్షలు కమీషన్, క్యాషియర్ ఔట్
బెంగళూరు: బంగారు నగల వ్యాపారి దగ్గర ఉన్న బ్లాక్ మనీ వైట్ మనీ చేసివ్వడానికి రూ. 30 లక్షలు కమీషన్ తీసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు (ఎస్ బీఐ) ఉద్యోగి మీద అధికారులు వేటు వేశారు.
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కోళ్లేగాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు బ్రాంచ్ లో క్యాషియర్ గా పని చేస్తున్న పరమశివమూర్తి అనే వ్యక్తిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పెద్ద నోట్లు మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం (నవంబర్ 24వ తేది) వరకు అవకాశం ఇచ్చింది. బంగారు నగల వ్యాపారం చేస్తున్న వేణుగోపాల్ అనే వ్యక్తి దగ్గర ఉన్న కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి 30 శాతం కమీషన్ ఇవ్వాలని బ్యాంక్ క్యాషియర్ పరమశివమూర్తి బంగారు నగల వ్యాపారి దగ్గర డిమాండ్ చేశాడు. అందుకు ఆయన సరే అన్నాడు.
బుధవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఆ బంగారు నగల వ్యాపారికి నగదు మార్చి ఇచ్చేశాడు. అర్దరాత్రి బ్యాంకులో జరిగిన ఈ తతంగం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది.
బంగారు నగల వ్యాపారి వేణుగోపాల్ దగ్గర పాత నోట్లు తీసుకుని కొత్త రూ. 2,000, రూ.500, రూ.100 నోట్లు ఇస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ దర్యాప్తు చేయించారు.
ప్రాథమిక దర్యాప్తులో క్యాషియర్ పరమశివమూర్తి దాదాపు రూ. 30 లక్షలు కమీషన్ తీసుకుని బంగారు నగల వ్యాపారి వేణుగోపాల్ కు పెద్ద ఎత్తున కొత్త నోట్లు ఇచ్చాడని వెలుగు చూసింది. క్యాషియర్ పరమశివమూర్తిని సస్పెండ్ చేశారు.
బంగారు నగల వ్యాపారి వేణుగోపాల్, బ్యాంకు మేనేజర్ పరమశివమూర్తి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పాత నోట్లు రద్దు అయిన తరువాత క్యాషియర్ పరమశివమూర్తి ఎంత మంది దగ్గర ఇలా కమీషన్ తీసుకుని కొత్త నోట్లు ఇచ్చాడు అని ఆరా తీస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు.