అప్పటివరకు ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లు యధాతథం
బెంగళూరు: పోలింగ్ తేదీ సమీపిస్తోన్న కొద్దీ కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోన్నప్పటికీ- వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్బై చెప్పారు.
కర్ణాటకలో మెజారిటీ సంఖ్యలో ఉన్న లింగాయత్, వక్కలిగ సామాజిక వర్గాలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఇతర వెనుకబడిన సామాజిక వర్గాల కోటా కింద ముస్లింలకు అమలవుతోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి, దాన్ని లింగాయత్, వక్కలిగలకు కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకూ ఇదివరకట్లా ముస్లింలకు నాలుగు శాతం ఓబీసీ రిజర్వేషన్ను కొనసాగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన పిటీషన్లపై విచారణను మే 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు- విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు నాలుగు శాతం ఓబీసీ రిజర్వేషన్ల కోటాను అమలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం ఓబీసీ రిజర్వేషన్ల కోటాను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు శాతాన్ని వక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు బదలాయించింది. ఈ రెండు వర్గాల వారికి ఆ నాలుగు శాతం కోటాను సర్దుబాటు చేసింది.
దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ఈ సర్దుబాటు చెల్లదని, ముస్లింలకు నాలుగు శాతం కోటాను కొసాగించాలంటూ ఇదివరకు పిటీషన్లపై విచారణ చేపట్టినప్పుడే సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ కొనసాగిస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications