మమత సర్కార్ ను మళ్లీ ఏకేసిన సుప్రీంకోర్టు-అడక్కుండా శవపరీక్ష ఎలా..?
పశ్చిమబెంగాల్లోని కోల్ కతాలో ఉన్న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో మమతా బెనర్జీ సర్కార్ ను మరోసారి సుప్రీంకోర్టు ఏకిపారేసింది. ముఖ్యంగా అత్యాచారం, హత్య జరిగిన ట్రైనీ డాక్టర్ శవాన్ని శవ పరీక్షకు పంపే విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సీబీఐని మళ్లీ తాజాగా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి సీబీఐ ఇవాళ దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇచ్చింది. ఇందులో తమకు ఎదురైన అడ్డంకుల్ని సైతం పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం .. పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు శవానికి అధికారిక అనుమతి లేకుండా శవపరీక్ష అలా చేశారని ప్రశ్నించింది. అంతే కాదు చలాన్ లేకుండా పోస్టుమార్టానికి శవాన్ని ఎలా అప్పగించారని నిలదీసింది.

దీనిపై స్పందించిన సీబీఐ.. అసలు చలాన్ లేకుండా శవం పోస్టుమార్టానికి డాక్టర్ కూడా తీసుకోరని తెలిపింది. అలాగే సీబీఐకి కూడా దర్యాప్తులో చలాన్ దొరకలేదని తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు.. అసలు మొత్తం ప్రక్రియ వీడియో తీసారా లేదా అని నిలదీసింది. దీనికి సమాధానంగా బెంగాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అంతా వీడియో తీశారని తెలిపారు. అలాగే బెంగాల్ ప్రభుత్వం ఆర్ జీ కర్ ఆస్పత్రి వద్ద బందోబస్తుకు పంపిన సీఐఎస్ఎఫ్ బలగాలకు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించింది. దీంతో కేంద్రం, బెంగాల్ ప్రభుత్వం మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications