సహారా ఆస్తులమ్మి కట్టండి: సుప్రీం ఆదేశాలు జారీ
ఢిల్లీ: సహారా గ్రూపు ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది. ఓ కమిటీని నియమించి సంస్థ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని సెబీ(సెక్యూరిటీస్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆస్తులను మార్కెట్ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని సూచించింది. ఆ సంస్థకు చెందిన 86 ఆస్తులను కమిటీ పర్యవేక్షణలో అమ్మాలని తెలిపింది. కాగా, సహారాకు మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ ఆస్తులున్నాయి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి ఎన్ అగర్వాల్, సహారా నేతృత్వంలో ఆస్తుల విక్రయం వ్యవహారాలను నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సహారా గ్రూపు సంస్థలు ప్రజల నుంచి రూ. 36వేల కోట్ల డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో అరెస్టయిన సహారా అధినేత సుబ్రతా రాయ్కి బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఈ మొత్తాన్ని చెల్లించని కారణంగా మార్చి 2014లో అరెస్టయిన సుబ్రతా రాయ్.. దాదాపు రెండేళ్లుగా జైల్లోనే ఉంటున్నారు.