సాగు చట్టాలను మళ్ళీ తెస్తాం; కేంద్రం కసరత్తు చేస్తుందన్న కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల నిరసనల తర్వాత గత నెలలో రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు . మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, మూడు చట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తీసుకుందని, అయితే అది కూడా మళ్లీ ముందుకు వెళ్లడం కోసమేనని చేసిన వ్యాఖ్యలు, కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలను తిరిగి ప్రవేశపెడుతుందన్న భావనకు ఊతమిస్తున్నాయి.

వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఒకడుగు వెనక్కు వేసింది.. ముందడుగు వేస్తుంది
నాగ్పూర్లో జరిగిన ఆగ్రో విజన్ ఎక్స్పో ప్రారంభోత్సవంలో తోమర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకు వచ్చిందని, అయితే కొంతమందికి ఈ చట్టాలు నచ్చలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, నల్ల చట్టాలు అంటూ చేసిన కొందరు చేసిన ప్రచారంతో ప్రభుత్వం నిరాశ చెందలేదని... ఒక అడుగు వెనక్కి వేసిందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ముందడుగు వేస్తామంటూ వెల్లడించారు.

సాగు చట్టాల కోసం కసరత్తు జరుగుతుంది
సాగు చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తీసుకువస్తామని, సాగు చట్టాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఆమోదయోగ్యంగా ఉండేలా సాగు చట్టాలను రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కసరత్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రైతులు భారతదేశానికి వెన్నెముక అని, వెన్నెముక బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోడీ
గత నెలలో, ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్ ప్రసంగంలో ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుంది అని ప్రకటించారు. వ్యవసాయ రంగ సంస్కరణల ప్రయోజనాల గురించి నిరసన తెలిపే రైతులను అవి రైతు సంక్షేమం కోసం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలని బిజెపి ప్రభుత్వం ఒప్పించలేక పోయింది. ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని, రైతులు అధికంగా ఉన్న పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన
కేంద్రం నూతన సాగు చట్టాల బిల్లును పార్లమెంటులో ఆమోదించి చట్టంగా తీసుకు వచ్చిన క్రమంలో, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లకు చెందిన వేలాది మంది రైతులు ఈ సంవత్సరం పాటు ఆందోళన కొనసాగించారు. ఢిల్లీలోని తిక్రీ, సింఘూ, ఘాజీపూర్ మూడు సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో ఏడాది పొడవునా సాగిన రైతుల ఆందోళనను విరమించుకున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో మళ్ళీ ఏం చెయ్యబోతున్నారో అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications