జైలు నుంచి సిమీ కార్యకర్తల పరారీ: ఒకరి పట్టివేత
పరారైనవారిలో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఖైదీల పరారీ విషయంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి ఉమా శంకర్ గుప్తా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపనున్నట్లు తెలిపారు.
టాయిలెట్ గోడలను పగులగొట్టి ఖైదీలు పారిపోయినట్లు తెలుస్తోంది. పారిపోయే సమయంలో అడ్డం వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వారు కత్తులతో దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఖాంద్వాలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఖైదీల దాడిలో గాయపడిన కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. పారిపోయిన నిషేధిత సిమి కార్యకర్తలను మెహబూబ్ అబూ ఫజల్ ఖాన్, అంజాద్ ఖాన్, అస్లామ్, ఐజాజుద్దీన్, జకీర్లుగా గుర్తించారు. వీరిపై హత్య, హత్యాప్రయత్నం కేసులున్నాయి. ఏడో ఖైదీ అబిద్ అన్సారీని మాత్రం పోలీసులు పట్టుకోగలిగారు. అస్పత్రిలో రెండేళ్ల క్రితం బాంబు పెట్టిన కేసులో ఇతను నిందితుడు.