'వీడియోలు విడుదల చేయొద్దు': కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్ దాడుల తాలుకా వీడియోలను బయట పెట్టొద్దని మాజీ జనరల్ శంకర్ రాయ్ చౌదరి కోరారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్జికల్ స్ట్రయిక్స్కి సంబంధించిన కీలక సమాచారం కోసం పాకిస్థాన్ సైన్యంతో పాటు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయని ఆయన చెప్పారు. భారత్లోని మీడియా నుంచి ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని నిరంతరం గమనిస్తున్నాయని పేర్కొన్నారు.
నిఘా సమాచారంలో దాదాపు 80 శాతం వరకు బహిరంగ వనరుల నుంచే వస్తూ ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని ఆయన సూచించారు. భారత సైన్యం చేసిన మెరుపు దాడులను ఏ విధంగా నిర్వహించిందో, ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తుందో తెలుసుకోవాలని శత్రువులు కాచుకుని కూర్చున్నారని అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించాయని వస్తున్న వార్తలు ముమ్మాటికీ అబద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరుతున్నట్లుగా మెరుపుదాడుల వీడియోలను విడుదల చేయకూడదన్నారు.
కాగా, శంకర్ రాయ్ చౌదరి 1994 నుంచి 1997 వరకు భారత సైన్యం చీఫ్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను భారత ఆర్మీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ఈ వీడియో ఫుటేజీ విడుదల చేయాలా? వద్దా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
సాక్ష్యాలను బయటపెట్టి అసలు దాడులు జరగలేదంటున్న విమర్శకులు నోళ్లు మూయించాలని ఆర్మీ భావిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఈ వీడియో పుటేజీల విషయంలో వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే.
వీడియోలను బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనే దానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. కాగా బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరిగింది.