సీఎం రేసునుండి పవార్ ఔట్, 10సీట్లకంటే ఎక్కువ రావు
ముంబై: తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని ఎన్సీపీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎలాంటి అధికారిక పదవిని ఆశించడం లేదని చెప్పారు. తాను పార్టీ వ్యవహారాలు చూసుకుంటానన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పవార్పై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.
తనకు వయస్సు 70 ఏళ్లు దాటిందని, 48 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, 25 ఏళ్లు అధికార పదవిలో ఉన్నానని, ఇప్పుడిక ఏ అధికారిక పదవీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నానని, పార్టీ కార్యక్రమాలు, బలోపేతానికి పని చేస్తానని చెప్పారు. ఈ నెల 15న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని, అలాగే ఎలాంటి అధికారిక పదవిని చేపట్టనని ఇది వరకే ఆయన ప్రకటించారు. కాగా ఎన్నికల అనంతరం రాజకీయ పునరేకీకరణపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఎన్నికల్లో ఎన్సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు.

ఎన్సిపి దృష్టంతా మెజారిటీపైనే, అందువల్ల ఫలితాల తరువాత పొత్తుల గురించి తాము ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో చిచ్చుపెట్టింది మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవానేనని ఆరోపించారు. కాంగ్రెస్కు తెలిసే ఇదంతా జరిగిందని పవార్ అన్నారు. సరిసమానంగా సీట్లు పంచుకుని రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు.
దీనికి సంబంధించి సంప్రదింపులు ఓ పక్కసాగుతుండగానే కాంగ్రెస్ జాబితాను విడుదల చేసిందని ధ్వజమెత్తారు. తమకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్నారు. ఎన్నికల సభలన్నీ విజయవంతమవుతుండడమే దానికి కారణమన్నారు.
లైంగిక అత్యాచారంపై మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పాటిల్ వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. వాటిని ఖండిస్తున్నానని చెప్పారు. ఆర్ఆర్ పాటిల్ కూడా ఆ తర్వాత క్షమాపణ కోరారని చెప్పారు.
పది సీట్లు రావు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరో పది సీట్లకు మించి రావని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఎన్సీపీ గుర్తు అయిన గడియారంలో పది గంటల పది నిమిషాలు చూపించడం మీ అందరికీ తెలుసునని, దాని అర్థం ఏమిటో తెలుసా? కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరి పది సీట్లకన్నా ఎక్కువ రావనేదే దాని అర్థమని ఎద్దేవా చేశారు. మోడీ మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీలు తమ 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని కావలసినంత దోచుకున్నాయని, వాటికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి రాష్ట్రాన్ని పాలించినప్పుడు వాళ్లు మీకు ఏమిచ్చారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానని, రైతులకు, గ్రామాలకు, చివరికి నగరాలకు వాళ్లు ఏమయినా మేలు చేసారా? అలాంటప్పుడు వాళ్లను ఎందుకు బతకనిస్తారు? ఇన్నేళ్లుగా వాళ్లు మిమ్మల్ని కావలసినంత దోచుకున్నారని, వాళ్లకు ఇక్కడ ఎంతమాత్రం స్థానం న్నారు.
ఎన్సీపీ జాతీయవాద పార్టీ కాదని అది భ్రష్టాచార వాద పార్టీ అన్నారు. ఎన్సీపీ నేతలు ఎలాంటి భాష వాడుతున్నారో అందరికీ తెలుసుని, వాళ్ల మాటలు విని నా తల సిగ్గుతో వంగిపోతోందని, ఛత్రపతి శివాజీకి చెందిన మహారాష్ట్రలో అలాంటి నేతలు ఉండడం బాధాకరమని, రాష్ట్రం నుంచి ఈ కళంకాన్ని మనం తుడిచివేయాలన్నారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ప్రదాని నొక్కి చెప్పారు.












Click it and Unblock the Notifications