భారత్ను భయపెడుతున్న అంకెలు.. 11వేల మార్క్ దాటిన కేసులు.. 24గంటల్లో ఎన్ని కొత్త కేసులంటే?
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదట్లో దేశవ్యాప్తంగా కేవలం పదుల సంఖ్యలోనే కేసులు నమోదవగా.. ప్రస్తుతం వెయ్యి మార్క్తో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,815కి చేరింది. ఇప్పటివరకు 353 మంది మృత్యువాతపడ్డారు. అయితే వరల్డ్ మీటర్ ప్రకారం భారత్లో కేసుల సంఖ్య 11,487కి చేరింది. పెరుగుతున్న నంబర్స్ను చూస్తుంటే భారత్లో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నా.. మరోవైపు వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తుండటం కలవరపెడుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు..
ఇప్పటివరకు నమోదైన మొత్తం 10815 కేసుల్లో 1,189 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 9272 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 12) నుంచి దేశవ్యాప్తంగా 50కి పైగా మరణాలు సంభవించగా అందులో ఒక్క మహారాష్ట్రలోనే 22 మరణాలు సంభవించాయి. తెలంగాణ,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 7,ఢిల్లీ,గుజరాత్లలో 5,పశ్చిమ బెంగాల్లో1, కేరళ,ఆంధ్రప్రదేశ్,జార్ఖండ్లో ఒక్కో మరణం సంభవించాయి. మొత్తం మరణాల్లో 160 మరణాలతో మహారాష్ట్ర టాప్లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్-50,గుజరాత్-26,ఢిల్లీ-28,తెలంగాణ17,పంజాబ్-12,తమిళనాడు-11,ఆంధ్రప్రదేశ్-9,కర్ణాటక-9 ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్న లెక్కలకు.. ఆయా రాష్ట్రాలు ప్రకటిస్తున్న లెక్కలకు కొంత తేడా కనిపిస్తోంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కలు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మంగళవారం(ఏప్రిల్ 14) సాయంత్రానికి మహారాష్ట్రలో అత్యధికంగా 2337 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ-1510,తమిళనాడు-1173 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్తాన్లో 879,మధ్యప్రదేశ్లో 657,ఉత్తరప్రదేశ్లో 657,తెలంగాణలో 624,గుజరాత్ 617,ఆంధ్రప్రదేశ్లో 473,కేరళలో 379 కేసులు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్లో 270,కర్ణాటకలో 258,హర్యానాలో 199,పశ్చిమ బెంగాల్లో 190,పంజాబ్లో 176కి చేరుకున్నాయి. బీహార్లో 66,ఒడిశాలో 55,ఉత్తరాఖండ్లో 35,హిమాచల్ ప్రదేశ్లో 32,అసోం,ఛత్తీస్ఘడ్లో 31 కేసులు నమోదయ్యాయి.లడఖ్లో 15,అండమాన్ నికోబార్ దీవుల్లో 11 కేసులు నమోదయ్యాయి.

అతిపెద్ద లాక్ డౌన్..
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో లాక్ డౌన్ను మే 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,అధికారులు,నిపుణులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద లాక్ డౌన్ కావడం గమనార్హం. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి వైరస్ ప్రభావం లేనిచోట్ల సడలింపులపై ఆలోచిస్తామన్నారు. రెండో విడత లాక్ డౌన్కు సంబంధించి నేడు మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. గత మూడు వారాల్లో మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి కావడం విశేషం












Click it and Unblock the Notifications