షీలా దీక్షిత్ ప్రస్థానం..చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే...!
ఢిల్లీ: రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.శనివారం ఉదయం పరిస్థితి కాస్త సీరియస్గా మారడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు షీలా దీక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
2019లోక్సభ ఎన్నికల్లో పోటీ
షీలా దీక్షిత్ ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. చివరి శ్వాస వరకు నిబద్దతగల నేతగా పార్టీకి సేవలందించారు. 2013లో ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేసి ఓడిపోయారు. కేజ్రీవాల్ 25,864 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 1998 నుంచి 2013 వరకు మూడు సార్లు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
పంజాబ్లో జన్మించిన షీలా దీక్షిత్
షీలా దీక్షిత్ 1938 మార్చి 31న పంజాబ్లోని కపుర్తలాలో జన్మించారు. న్యూఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూలులో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ అనుబంధ సంస్థ మిరందా హౌజ్ నుంచి హిస్టరీలో మాస్టర్స్ చేశారు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతల్లో ఒకరైన షీలా దీక్షిత్ ఢిల్లీకి అత్యంత ఎక్కువ కాలం పాటు సీఎంగా పనిచేసిన లీడర్గా గుర్తింపు పొందారు.ఆమె మామ సామాజిక కార్యకర్తగా పనిచేయడమే కాదు.. ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రిగా సేవలందించారు. ఇక ఎంపీగా కూడా షీలా దీక్షిత్ సేవలందించారు. ఉత్తర్ప్రదేశ్లోని కనౌజ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. లోక్సభ ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.
ఐక్యరాజ్యసమితిలో కూడా సేవలందించిన షీలా దీక్షిత్
ఐక్యరాజ్యసమితిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కమిషన్లో 1984 నుంచి 1989 వరకు సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నసమయంలో మహిళల అభ్యున్నతి కోసం షీలాదీక్షిత్కు బాధ్యతలు అప్పగించారు. రాజీవ్ గాంధీ కేబినెట్లో షీలా దీక్షిత్ 1986 నుంచి 1989 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో గోల్ మార్కెట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షీలా దీక్షిత్ బీజేపీ అభ్యర్థి కీర్తి ఆజాద్పై విజయం సాధించారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1998 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాలు కైవసం చేసుకుంది.
షీలా దీక్షిత్ హయాంలోనే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ
షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి.అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 2013 డిసెంబర్ 8న షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా షీలా దీక్షిత్ను ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా నియమించింది హస్తం పార్టీ. ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీకి చెందిన మనోజ్ తివారీపై ఆమె ఓటమిపాలయ్యారు.
పలువురు ప్రముఖుల సంతాపం
షీలా దీక్షిత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.