నరేంద్ర మోడీ గత రికార్డులన్నీ బద్దలు కొట్టారు కానీ, ఉపయోగం లేదు: శివసేన
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ అత్యధికసార్లు విదేశాల్లో పర్యటించి గత రికార్డులు బద్దలు కొట్టారని, కానీ దాని వల్ల దేశానికి ఏ ప్రయోజనం చేకూరిందని శివసేన ప్రశ్నించింది. ఫ్రాన్స్, రష్యాలతో భారత్ యుద్ద విమానాల ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో తమ దేశ ఎఫ్ 16 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవాలని, లేదంటే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోందన్నారు.
విష్ణుమూర్తి మళ్లీ తన రూపంలో జన్మించినట్లు ప్రధాని మోడీ ప్రపంచం మొత్తం పర్యటిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారని ఎద్దేవా చేసింది. కొన్ని దేశాలతో భారత్కు సత్సంబంధాలు లేవని, ఆయా దేశాలతో బంధాన్ని బలపర్చడానికే మోడీ పర్యటనలు చేస్తున్నట్లున్నారని పేర్కొంది. కానీ ఆయన పర్యటన వల్ల కోట్లాది రూపాయలు ఖర్చవుతోందని పేర్కొంది.
'యువతలో మార్పులు, ఆ రెండు జరిగితే 2019లో బీజేపీకి 350 సీట్లు ఖాయం'
డబ్బు ఖర్చయినప్పటికీ భారత్కు మాత్రం ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని అన్నారు. తొలుత ఫ్రాన్సుతో కేంద్రం రఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు ఒప్పందం చేసుకుందని, దీనిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంది. రష్యాతో ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై అమెరికా అభ్యంతరాలు చెబుతోందన్నారు.
భారత్-పాక్ల మధ్య శాంతి ఉండాలని ఆర్థికాభివృద్ధి సాధించిన ఏ దేశమూ కూడా కోరుకోవడం లేదని పేర్కొంది. ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, ఈజిప్ట్, అఫ్గానిస్థాన్తో పాటు పాకిస్తాన్, భారత్లలో అస్థిర పరిస్థితులు ఉండాలనే అవి కోరుకుంటాయని తెలిపింది.
కనీసం భారత్ పొరుగున ఉన్న దేశాలు కూడా మన దేశంతో నిజంగా స్నేహం కోరుకోవడం లేదని తెలిపింది. నేపాల్ హిందూ దేశం అయినప్పటికీ చైనా, పాకిస్తాన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, మోడీ విదేశీ యాత్రల కోసం చేస్తున్న ఖర్చు వల్ల దేశానికి ఏ ప్రయోజనం చేకూరిందో చెప్పాలని ప్రశ్నించింది.