‘మార్పుంటే చెప్పండి ప్లీజ్’: బిజెపి సిఎం ఫడ్నవీస్పై శివసేన సెటైర్లు
ముంబై: నిన్నమొన్నటి దాకా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై విమర్శలు కురిపించిన శివసేన.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై విరుచుకుపడింది. 'మహారాష్ట్రలో సిఎం మాత్రమే మారారు. వ్యవస్థలో మాత్రం ఏలాంటి మార్పులేదు' ఆయన సెటైర్లు వేసింది.
తన సొంత పత్రిక ‘సామ్నా' సంపాదకీయంలో శివసేన విమర్శలను సుతిమెత్తగా సంధించింది. ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏమైనా మార్పు కనిపించిందా? అయితే దయచేసి అదెంటో మాకు చెప్పండి' అంటూ రాష్ట్ర ప్రజలకు శివసేన విజ్ఞప్తి చేసింది.
అంతేగాక ‘ఫడ్నవీస్ వ్యక్తిగత చరిష్మా, స్వప్రయోజనాలకే పాకులాడుతున్నారు' అని ఆరోపించింది. కమ్యూనిస్టు నేత, యాంటీ టోల్ టాక్స్ ప్రచారకర్త గోవింద్ పన్సేరా హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో, వారిని శిక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించింది.
రోడ్ల అభివృద్ధి, పౌరసేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎంతోకాలంగా పన్సేరా తీవ్రంగా వ్యతిరేకించారు. పన్సేరా ఫిబ్రవరి 17న తన భార్యతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.