యోగిని చూసి నేర్చుకోండి.. రైతుల పట్ల ఇంత అలసత్వమా?: శివసేన ఫైర్
ఓవైపు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. మహారాష్ట్ర సర్కార్ మాత్రం రుణమాఫీ విషయంలో ఇంకా జాప్యం చేస్తూనే ఉందని అన్నారు.
ముంబై: శివసేన తమ అధికారిక పత్రిక 'సామ్నా' ద్వారా మహారాష్ట్ర సర్కార్ కు చురకలంటించింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని ఎండగడుతూ యూపీ సీఎం యోగిని చూసి నేర్చుకోవాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం సీరియస్ నెస్ కనబరచడం లేదని శివసేన ఆరోపించింది. మీన మేషాలు లెక్కిస్తూ రైతుల రుణమాఫీ విషయంలో మహారాష్ట్ర సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని శివసేన మండిపడింది. ప్రజాసంక్షేమం కోసం యోగి ఆదిత్యనాథ్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది.
ఈ సందర్బంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ మీటింగ్ లోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారని శివసేన గుర్తుచేసింది. ఓవైపు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. మహారాష్ట్ర సర్కార్ మాత్రం రుణమాఫీ విషయంలో ఇంకా జాప్యం చేస్తూనే ఉందని అన్నారు.
కాగా, మహారాష్ట్ర సర్కార్ మాత్రం యోగి మోడల్ అధ్యయనం తర్వాత రుణమాఫీపై ఫోకస్ చేస్తామని చెబుతోంది. దీంతో మహారాష్ట్ర సర్కార్ రైతుల పట్ల సీరియస్ నెస్ తో వ్యవహరించడం లేదని, యూపీ సీఎం యోగిని చూసి నేర్చుకోవాలని ఫడ్నవీస్పై శివసేన ఫైర్ అయింది.