శివసేన చిందులు, పడగొట్టం కానీ: మళ్లీ పవార్ ట్విస్ట్
ముంబై: మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ వ్యాఖ్యల పైన శివసేన బుధవారం మండిపడింది. రాజకీయాలపై అపనమ్మకం ఉన్నవారే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని తమ పత్రిక సామ్నాలో విమర్శించింది.
రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతను ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎన్సీపీ చూస్తోందని ఆరోపించింది. తొలుత బేషరతు మద్దతు ప్రకటించిన శరద్ పవార్, ఆయన పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని పేర్కొంది.
తాము మాత్రం అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటామని తెలిపింది. పవార్ తనకు ఇష్టమనున్నది చేసుకోవచ్చునని ఎద్దేవా చేసింది. తాము మాత్రం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పింది. ప్రభుత్వాన్ని భవిష్యత్తులో తమ చేతుల్లో ఉంచుకోవాలని ఆయన భావిస్తున్నారని ఆరోపించారు.
పూర్తి మెజార్టీ లేని ప్రభుత్వాన్ని ఆయన తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన రాజకీయ తీరు నవ్వుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. అది చేస్తా, ఇది చేస్తాననే పవార్ వ్యాఖ్యలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

శరద్ పవార్ కన్ఫ్జూజన్ సృష్టిస్తుంటారని విమర్శించారు. కన్ఫ్జూజన్ సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే ఆయన లక్ష్యమని మండిపడ్డారు. అదే ఆయన రాజకీయ మనుగడకు కారణమని ఎద్దేవా చేశారు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా తమకు ఎలాంటి ముప్పులేదని ధీమా వ్యక్తం చేస్తోంది.
పాతమిత్రులు కలిసేనా?
శరద్ పవార్ వ్యాఖ్యల పైన శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను తాము సహించమని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. శివసేన తీరు చూస్తుంటే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అడ్డుకోవచ్చుననే భావన కనిపిస్తోందని అంటున్నారు.
కాగా, శరద్ పవార్ మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్ధితులు చూస్తుంటే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని, అందురు పార్టీ కార్యకర్తలు సిధ్దంగా ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రాయగడ్ జిల్లాలోని అలీబేగ్లో రెండు రోజులపాటు పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
పవార్ రివర్స్
శరద్ పవార్ బుధవారం యూ టర్న్ తీసుకున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనేదీ తమకు లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావిస్తే తమ నిర్ణయం మారుతుందన్నారు. పూణే సమీపంలోని అలీబూగ్లో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.












Click it and Unblock the Notifications