షాకింగ్ : 2100 నాటికి మన జనాభా 41 కోట్లు తగ్గిపోతుందట- జనసాంద్రతలోనూ పతనం..
ప్రపంచంలోనే అత్యంత జనాభా, జనసాంద్రత కలిగిన దేశాల్లో భారత్ రెండో స్ధానంలో ఉంది. భారత్ జనాభా ప్రస్తుతం 150 కోట్లకు పరుగులు పెడుతోంది. తాజా జనాభా లెక్కల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ తరుణంలో భారత్ లో జనాభా పెరుగుదల, జనసాంద్రత విషయంలో స్టాన్ ఫోర్డ్ అధ్యయనం షాకింగ్ ఫలితాల్ని వెల్లడించింది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. అయితే దాని జనాభా రాబోయే 78 సంవత్సరాలలో 41 కోట్లు తగ్గిపోతుందని స్టాన్ ఫోర్డ్ తాజా అధ్యయనం అంచనా వేసింది. అధిక జనాభా అనేది వ్యక్తులకు తక్కువ వనరులు అందించే పరిస్ధితి అయితే, జనాభా తగ్గడం అనేది మాత్రం ఓ దివ్యౌషధం కాదని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.

జనాభా పెరుగుదల ప్రతికూలంగా ఉన్నప్పుడు, జనాభాలో జ్ఞానం, జీవన ప్రమాణాలు స్తబ్దుగా ఉంటాయని, అది క్రమంగా అదృశ్యమవుతుందని స్టాన్ఫోర్డ్ అధ్యయనం తెలిపింది. వాస్తవానికి ఇది హానికరమైన పరిణామమని కూడా వెల్లడించింది. భారతదేశ జనాభా సాంద్రత రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం భారతదేశం, చైనా జనాభా ఒకేలా కనిపిస్తున్నప్పటికీ వాటి సాంద్రతలలో చాలా తేడా ఉందని పేర్కొంది.
భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటరులో సగటున 476 మంది నివసిస్తుండగా, చైనాలో ఇది చదరపు కిలోమీటరుకు 148 మంది మాత్రమే. 2100 సంవత్సరం నాటికి, భారతదేశం యొక్క జనసాంద్రత ఒక కి.మీకి 335 వ్యక్తులకు తగ్గుతుందని అంచనా వేసింది. భారతదేశ జనాభా సాంద్రత తగ్గుదల మొత్తం ప్రపంచానికి అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం అంచనా వేసింది. భారతదేశ జనాభా సాంద్రత అంచనాలో తగ్గుదల దేశ జనాభా అంచనాల సంకోచం కారణంగా ఉందని తెలుస్తోంది. భారతదేశ జనాభా 2022లో 141.2 కోట్ల నుండి 2100 నాటికి 100.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుల జనాభా విభాగం తాజా నివేదికలో అంచనా వేసింది.












Click it and Unblock the Notifications