శ్రద్ధా వాల్కర్ కేసు: నార్కో, పాలిగ్రాఫ్ టెస్టులలో నిందితుడు నిజాలు చెబుతాడా, వీటిని ఎలా నిర్వహిస్తారు?
దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది శ్రద్ధా వాల్కర్ మర్డర్ కేస్. ఇందులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు దిల్లీ పోలీసులు నార్కో, పాలీగ్రాఫ్ టెస్టులు చేయనున్నారు.
నేర పరిశోధనలో నిందితులు లేదా అనుమానితులు అబద్ధాలు చెబుతున్నారా, మోసం చేస్తున్నారా అని కనుక్కోవడానికి అనేక పద్ధతులు వాడతారు.
పాలీగ్రాఫ్, నార్కో ఎనాలసిస్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ వంటి ఆధునిక పద్ధతులు భౌతికంగా లేదా మానసిక గాయం కలిగించకుండా మోసాన్ని గుర్తించేందుకు సహాయపడతాయి.
https://twitter.com/ANI/status/1596456647815483393
నార్కో ఎనాలసిస్ టెస్ట్ అంటే?
ఈ టెస్టులో సోడియం పెంటోథాల్ అనే డ్రగ్ వాడతారు. దీన్నే ట్రూత్ సిరం అంటారు. ఇది మత్తును కలిగించే డ్రగ్. దీన్ని ఇచ్చిన తర్వాత 30 నుంచి 45 సెకన్లలోనే వ్యక్తులు స్పృహ కోల్పోతారు.
స్పృహ కోల్పోయిన తరువాత నిందితులు స్వేచ్ఛగా మనసులో ఏముందో చెప్పగలుగుతారు.
ఆ తరువాత ఎనలిస్టులు, నిందితుల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు.
ఈ పరీక్ష నిర్వహించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇచ్చే డోసులో ఎక్కువ, తక్కువలు జరిగితే నిందితుల ప్రాణాలకే ప్రమాదం.
పరీక్ష నిర్వహించేటప్పుడు నిందితులతో పాటు సైకాలజిస్టు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదా ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే ఉంటారు.
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: 'ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్లో యువతి హత్య.. ఇప్పుడు భారత్లో నిందితుడి అరెస్ట్.. ఎలాగంటే..
పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే?
దీన్నే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. ఇందులో నిందితులు సమాధానాలు చెప్పేటప్పుడు వారి శరీరం ఎలా స్పందిస్తోందన్నది మెషిన్ గుర్తిస్తుంది.
విచారణ సమయంలో బీపీ లేదా గుండె కొట్టుకునే రేటు, శ్వాస వేగాన్ని మెషిన్ గమనిస్తుంది.
అబద్ధం చెప్పినప్పుడు నిందితుల శరీరంలో మార్పులు వస్తాయి. బీపీతోపాటు శ్వాస తీసుకునే విధానం మారిపోతుంది.
ఈ టెస్ట్ ద్వారా నిందితులు నిజం చెబుతున్నారా లేక అబద్ధమాడుతున్నారా అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు.
పాలీగ్రాఫ్ విధానంలో ఎలాంటి మత్తు మందులు ఇవ్వరు. కార్డియో కఫ్లు, సెన్సిటివ్ ఎలక్ట్రోడ్స్ను మాత్రమే వాడతారు. ఈ పరికరాల ద్వారా శరీరంలోని మార్పులను గమనిస్తారు.
ప్రతి స్పందనకు ఒక వాల్యూను కేటాయిస్తారు. వాటి ద్వారా చెబుతున్నది నిజమా లేక అబద్ధమా అనేది తెలుసుకుంటారు.
ఈ టెస్టు ఎక్విప్మెంట్ను నిందితులకు 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే అటాచ్ చేస్తారు. కానీ రెండు గంటల పాటు వారు ఈ పరీక్ష నిర్వహించే గదిలో ఉండాల్సిందేనని ప్రొఫెసర్ గ్రుబిన్ అన్నారు.
భారత్తో పాటు జపాన్, రష్యా, చైనా వంటి చాలా దేశాలలో పాలీగ్రాఫ్ పరీక్షలను చేస్తున్నారు. చాలా వరకు ఈ పరీక్షకు వాడే టెక్నాలజీ కూడా ఒకే విధంగా ఉంటోంది.
పాలీగ్రాఫ్ టెస్ట్లో నిజాలు దాచవచ్చా?
నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, ఈ పరీక్షలో కూడా నిందితులు నిజాలు దాచే అవకాశం ఉంటుంది.
పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేటప్పుడు కచ్చితంగా శిక్షణ ఇవ్వాలని గ్రుబిన్ అన్నారు. అయితే, నిపుణులైన ఇన్వెస్టిగేటర్ లేకపోతే, ఏ విధానం సరిగ్గా పని చేయదని అన్నారు.
ఈ పరీక్ష విజయవంతం కాకూడదని చాలా మంది పలు రకాల డ్రగ్స్ వాడేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. అందుకే ఈ పరీక్ష నిర్వహించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండి, దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీని కచ్చితత్వంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరీక్ష సమయంలో సాధారణంగా నిందితులు ఒత్తిడికి గురవుతారు. కొన్ని సార్లు నేరం చేయనివారు కూడా భయం కారణంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
అబద్ధాలను గుర్తించేందుకు ఇది సరియైన విధానమని, కానీ నిజాలను రాబట్టేందుకు మాత్రం ఈ విధానం కరెక్ట్ కాదని డాక్టర్ వ్యాన్ డెర్ జీ అన్నారు.
- డిజిటల్ రేప్: 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు.. డిజిటల్ రేప్ అంటే ఏమిటి?
- కాకినాడ: ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసి చంపేసిన యువకుడు
ఈ టెస్టులు ఎప్పుడు నిర్వహిస్తారు?
నార్కో ఎనాలసిస్, పాలీగ్రాఫ్ లేదా లై డిటెక్టర్ టెస్టులు అత్యంత అరుదైన కేసులలో మాత్రమే నిర్వహిస్తారు.
నేరం అత్యంత క్రూరమైనదిగా, అమానవీయంగా జరిగిందని పోలీసులు భావించినప్పుడు, నిందితులు నిజాలను దాస్తున్నారని అనుమానించినప్పుడు, విచారణకు సహకరించనప్పుడు ఈ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరతారు.
తొలిసారి ఎప్పుడు చేశారు?
నార్కో అనాలసిస్ పరీక్షను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా వాడారని చెబుతుంటారు. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ వంటి వాటిలో నార్కో అనాలసిస్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు.
19వ శతాబ్దంలో తొలిసారి ఇటాలియన్ క్రిమినాలజిస్ట్ సీజేర్ లోంబ్రోసో, పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఇంటరాగేషన్ సమయంలో నేరస్తుల రక్తపోటులో వచ్చే మార్పులను ఒక డివైజ్ ద్వారా ఆయన గుర్తించారు.
1914, 1921లలో అమెరికన్ సైకాలజిస్టులు విలియం మార్స్టోన్, కాలిఫోర్నియా పోలీసు అధికారి జాన్ లార్సన్లు లై డిటెక్టర్ పరీక్షల కోసం అదే మాదిరి మెషిన్స్ను తయారు చేశారు.
1924 నుంచి పోలీసు ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్లలో లై డిటెక్టర్ టెస్టులను వాడుతున్నారు.
అయితే ఇప్పటికే ఈ విధానం వాడకంపై సైకాలజిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ రెండు పరీక్షలు శాస్త్రీయంగా 100 శాతం పూర్తి ఫలితాలు ఇవ్వలేవనే వాదనలు ఉన్నాయి.
భారత్లో ఎప్పుడు?
2008 నోయిడా జంట హత్యల కేసులో డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నుపుర్ తల్వార్లకు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.
2017 షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తెలిపారు. కాకపోతే తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నందున ఆ పరీక్ష అవసరం లేదని సీబీఐ తెలిపింది.
2019 ఉన్నావ్ అత్యాచార కేసులో కూడా సీబీఐ ఈ టెస్టులు నిర్వహించింది.
న్యాయపరమైన సవాళ్లు
భారత్లో ఈ పరీక్షలను నిర్వహించడం చట్టబద్దమే. అయితే ఈ పరీక్షలు నిర్వహించేందుకు నిందితుల అంగీకారం అవసరం.
ఈ పరీక్షల వల్ల తలెత్తే శారీరక, మానసిక, న్యాయపరమైన సమస్యలను నిందితులకు ముందుగానే వివరించాలి.
ఈ పరీక్ష నిర్వహించే సమయంలో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు నిందితుల సమ్మతిని తప్పకుండా రికార్డు చేయాలి.
ఈ పరీక్షల ద్వారా నిందితుల నుంచి రాబట్టే సమాచారాన్ని సాక్ష్యాలుగా కోర్టులు అంగీకరించవు. ఆధారాల్లో భాగంగా మాత్రమే చూపించాలి. ఆ సమాచారం ఆధారంగా నేరం చేసినట్లు నిర్ణయించకూడదు.
ఇవి కూడా చదవండి:
- రోమన్ సామ్రాజ్య చరిత్రలో కల్పిత చక్రవర్తిని నిజం చేసిన బంగారు నాణేం
- 'ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ: సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ
- ఆంధ్రప్రదేశ్: భూముల రీసర్వేపై విమర్శలేంటి, వందేళ్ళ తర్వాత ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు?
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: 'ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా డీపీలు ఎంతవరకు సేఫ్? మీ ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి