ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదు
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభుత్వం ఇంటికో ఉద్యోగాన్ని ప్రకటించింది. కేంద్రం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపగా రామ్నాథ్ కోవింద్ బిల్లుపై సంతకం చేసి తన ఆమోదాన్ని తెలిపారు. దీంతో రిజర్వేషన్ అంశాన్ని త్రీవంగా పరిగణిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
'ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం' పథకం ప్రారంభించిన సిక్కిం ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈబీసీ వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఒక డెసిషన్కు వచ్చేసింది. ఇక బీహార్ ప్రభుత్వం కూడా ఇదే ఫాలో అయ్యేలా కనిపిస్తోంది. విద్య ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తుండగా... సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ ఓ అడుగు ముందుకేశారు. 'ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం' అనే పథకంతో ఇంటికో ఉద్యోగం స్కీమ్ను ప్రవేశపెట్టారు.
' ఒక కుటుంబం ఒక ఉద్యోగం' పథకం ఏమిటి..?
సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ ప్రవేశ పెట్టిన ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లేని ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. వ్యవసాయం, పంటలపై తీసుకున్న రుణాలను రద్దు కూడా చేస్తారు. ప్రస్తుతం 12 ప్రభుత్వ విభాగాల్లో గ్రూపు సీ, గ్రూపు డీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అంతేకాదు ఈ పథకాన్ని అమలు చేస్తూ 32 నియోజకవర్గాల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లేకుండ ఉన్న కుటుంబాలలోని ఒకరికి తాత్కాలిక అపాయింట్మెంట్ ఆర్డరును స్వయంగా సీఎం పవన్ చామ్లింగ్ అందించారు.
ఒక్కరోజే 11వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు
అంతకుముందు రాష్ట్రంలోని 20వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ చామ్లింగ్ చెప్పారు. ఒక్క శనివారం రోజునే అధికారులు 11,772 మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈ ఆర్థిక సంవత్సరంలో 89రోజులకు వేతనం ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. మరికొన్ని ఉద్యోగాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.