తగ్గేదేలే!!.. ఏకంగా తీహార్ జైల్లోనే ఆఫీస్ ఓపెన్ చేశాడు!!
ప్రముఖులతో పరిచయాలున్నాయని అందరినీ నమ్మిస్తూ వందల కోట్లరూపాయల మోసానికి పాల్పడ్డ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ను తీహార్ జైలు నుంచి మరో జైలుకు పంపించవద్దని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. జైలులో తనకు ప్రాణహాని ఉందని, వేరే జైలుకు తరలించాలంటూ సుకేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను తిరస్కరించాలని ఈడీ కోరింది.
జైలులోనే కార్యాలయం ఏర్పాటు చేశాడు?
తాము ఎందుకు తిరస్కరించాలని కోరుతున్నామో చెబుతూ తీహార్ జైలులో సుకేశ్ కు చెందిన అక్రమాలను ఈడీ సుప్రీంకోర్టుకు వివరించింది. ఇవన్నీ తమ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. టెక్నాలజీని ఉపయోగించుకొని తనకున్న నైపుణ్యంతో ఇతరులను భారీగా మోసం చేసేవాడని, భార్య లీనాతో కలిసి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని వివరించింది. తీహార్ జైలులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడని వెల్లడించింది. ఇవన్నీ తమ విచారణలో తేలినట్లు వెల్లడించింది.
జైలు అధికారులకు ఖరీదైన బహుమతులు
జైలు అధికారులతో సుకేశ్ స్నేహం చేసేవాడు. వారికి ఖరీదైన బహుమతులు అందించి జైలులోనే సకల రాజభోగాలు అనుభవించాడు. జైలు నుంచే బెదిరింపులకు పాల్పడేవాడు. తీహార్ జైలులో సుకేశ్ ను కలవడానికి సినీ రంగానికి, టీవీ రంగానికి చెందిన ప్రముఖ నటీమణులు వచ్చేవారు. తనకోసం వచ్చేవారి రాకపోకల కోసం జైలు ప్రాంగణంలోనే బీఎండబ్ల్యూ కారును కూడా సుకేశ్ ఏర్పాటు చేసుకున్నాడని ఈడీ సుప్రీంకోర్టుకు వివరించింది.
జైలు నుంచే రూ.215 కోట్లు వసూలు చేశాడు!
జైలు నుంచే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలాగ మాట్లాడి రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్ శివిందర్ మోహన్ భార్య అదితిసింగ్ నుంచి రూ.215 కోట్లు వసూలు చేశాడని వెల్లడించింది. తాము పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత తీహార్ జైలులో ఉన్న లోపాలను చక్కదిద్దడంతోపాటు సుకేశ్ కు సహకరించిన అధికారులందరికీ అడ్డుకట్ట వేశామని ఈడీ అధికారులు చెప్పారు. మరో జైలుకు వెళ్లి తీహార్ జైలులో ఏమేం చేశాడో అవే చేస్తాడని, అవే అక్రమాలు కొనసాగించడానికి కుట్రలు చేస్తున్నాడని, అందుకే అతని పిటిషన్ ను తోసిపుచ్చాలని కోరింది.