అన్లాక్ 3 వేళ.. మైండ్ బ్లాక్ చేస్తోన్న కరోనా ఫిగర్స్: ఏపీ వాటా ఎఫెక్ట్?: సడలింపులతో మరింత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. ఎవరూ కోరుకోని రికార్డులు అవి. ఇదివరకు ఒక్కరోజులో 52 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..మరుసటి రోజే ఆ రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 55,079 పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదు అయ్యాయి. 779 మంది మరణించారు. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో అనూహ్యంగా పాజిటివ్ కేసుల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
పిల్లలు, వృద్ధులే కాదు..యువతపైనా కరోనా పడగ: బలం పుంజుకుంటోన్న వైరస్: డబ్ల్యూహెచ్ వార్నింగ్
16 లక్షలను దాటి..
కరోనా తీవ్రత ఏపీలో అంచనాలకు మించి కనిపించడం అటు కేంద్ర ప్రభుత్వ వైద్యశాఖ అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలను దాటుకుంది. ఇప్పటిదాకా 16,38,871 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 35,747 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలను దాటుకుంది.
తొలి అయిదు రాష్ట్రాల్లో ఏపీ..
ఇప్పటిదాకా 10,57,806 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,45,318 గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న తొలి అయిదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరుకుంది. వరుసగా రెండోరోజూ ఏపీలో 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అధిక టెస్టులు చేస్తున్నందు వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని సమర్థించుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు కూడా అవి పెరగడానికి కారణమౌతున్నాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో..
ఏపీ సహా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. వీర విజృంభణ చేస్తోంది. మహారాష్ట్ర-11,147, ఏపీ-10,167, తమిళనాడు-5864, కర్ణాటక-6128 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యే జాబితాలో కొనసాగిన ఢిల్లీలో దాని తీవ్రత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో 1093 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఈ సంఖ్య 506కు పరిమితమైంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించిన వారి వల్లే ఈ పెరుగుదల కనిపించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Recommended Video
ఒక్కరోజులో ఆరున్నర లక్షల వరకూ శాంపిళ్ల పరీక్షలు..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 1,88,32,970 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 6,42,588 మంది నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్టులను చేయడానికి అవసరమైన ల్యాబొరేటరీల సంఖ్యను పెంచడం, ప్రైవేటు ల్యాబ్స్ల్లో శాంపిళ్ల పరీక్షలకు అనుమతి ఇవ్వడం వంటి చర్యల వల్ల కోవిడ్ శాంపిళ్ల పరీక్షలు భారీగా పెరిగాయి.