సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లూ... జర భద్రం
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఉల్లంఘనలకు పాల్పడితే రూ. 50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు చేస్తే ఇక తిప్పలు తప్పవు.
ఇక డబ్బులు తీసుకుని ఇష్టమొచ్చినట్టు ప్రాడక్ట్ రివ్యూలు చెప్పేస్తే కుదరదు.
వ్లాగింగ్ చేస్తే డబ్బులొస్తాయి, యూట్యూబ్ చానెల్లో వీడియోలు చేస్తూ సంపాదించొచ్చు, ఇన్స్టాగ్రాంలో ఇన్ఫ్లూయన్సర్గా మారిపోతే మాంచి ఫాలోయింగ్తోపాటు ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అనుకునేవాళ్లు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి.
https://twitter.com/PIB_India/status/1616425225071255556
మార్గదర్శకాలను ఎవరు, ఎందుకు జారీ చేశారు?
కేంద్ర వినియోదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ గత శుక్రవారం ఈ ప్రకటన చేశారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లపై ఎండార్స్మెంట్ గైడ్లైన్స్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద వీటిని జారీ చేశారు.
సేవల విషయంలో, ప్రోడక్ట్ రివ్యూల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియో కంటెంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇలాంటి కంటెంట్కు కళ్లెం వేయడానికే కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేశామని కేంద్రం అంటోంది.
నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఇన్ఫ్లూయన్సర్లపై – సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జరిమానా విధిస్తుంది. జరిమానా రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఉంటుందని సీసీపీఏ అడిషనల్ సెక్రటరీ నిధి ఖరే తెలిపారు.
https://twitter.com/rohitksingh/status/1616720250896277509
ఎండార్స్మెంట్ గైడ్లైన్స్ అంటే ఏమిటి?
యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు ఇన్ఫ్లుయన్సర్లుగా మారుతున్నారు. వీళ్లు చేసే ప్రమోషనల్ వీడియోలు, ప్రోడక్ట్ రివ్యూలు, స్పాన్సర్డ్ కంటెంట్ వీడియోల ప్రభావం వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, ఇన్ఫ్లుయన్సర్లు చేసే ఇలాంటి వీడియోలకు కచ్చితంగా ప్రమోషనల్ వీడియోలని, స్పాన్సర్డ్ కంటెంట్ అని చెప్పాలి. వాళ్లకూ ఆ కంపెనీలకూ మధ్య ఉన్న మెటీరియల్ కనెక్షన్ గురించి ఎండార్స్ చేయాలి. అంటే, ఏదైనా కంపెనీ నుంచి ఉచితంగా బహుమతులు అందినా, వాళ్ల ప్రయాణాలను ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేసినా, ట్రావెలింగ్ సమయంలో బస చేసేందుకు కంపెనీలే స్పాన్సర్ చేసినా, ప్రోడక్ట్ రివ్యూలు చేస్తున్నందుకు సదరు కంపెనీ డబ్బులు చెల్లించినా కూడా వీటిని పారదర్శకంగా వ్యూయర్స్కు చెప్పాలి.
Advertisement, Sponsored, Paid promotion వంటి పదాలను స్పష్టంగా చూపించాలి. లేదంటే వీళ్లపై భారీ జరిమానా ఉంటుంది.
https://twitter.com/jagograhakjago/status/1618121883689582596
ఇండియాలో ఇన్ఫ్లుయన్సర్ల మార్కెట్ విలువ రూ. 1200 కోట్లు
జర్మనీకి చెందిన స్టాటిస్టా సంస్థ ప్రచురించిన రీసెర్చ్ రిపోర్ట్-2022లో భారత్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ల మార్కెట్ విలువ దాదాపు రూ. 1275 కోట్ల రూపాయలుందని పేర్కొంది.
ఈ మార్కెట్ విలువ 2025 నాటికి 2800 కోట్ల వరకూ చేరుకుంటుందని స్టాటిస్టా అంచనా వేసింది. దేశంలో లక్ష మందికి పైగా ఇన్ఫ్లూయన్సర్లు ఉన్నారు.
భవిష్యత్తులో వీరు ఇంకా పెరుగుతారు కాబట్టి, ఈ మార్కెట్ మరింత విస్తృతంగా మారుతుంది.
వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారాన్ని, అక్రమ వ్యాపార పోకడలను అనుసరించే అడ్వర్టైజ్మెంట్లను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని కన్జ్యూమర్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ అన్నారు.
వీటి పరిధిలోకి ఎవరు వస్తారు?
వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రోడక్ట్ రివ్యూ వీడియోలు, ప్రమోషనల్ వీడియోలు చేసే వ్లాగర్స్నూ (Vloggers), సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్నూ, ప్రమోషనల్ వీడియోలు చేసే సెలబ్రిటీలనూ కేంద్ర ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాల పరిధిలోకి తీసుకొచ్చింది.
ఎవరీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు?
సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్ను చేరుకుంటూ, ప్రజలను ప్రభావితం చేయగలిగే వ్యక్తులను ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ఇన్ఫ్లుయన్సర్లుగా చెబుతోంది.
సేవల విషయంలో, అనేక వస్తువులపై రివ్యూలను చెప్పడం ద్వారా ఫాలోవర్లతో తమ అనుభవాలను, అభిప్రాయాలనూ పంచుకుంటూ ఉంటారు. ప్రజల కొనుగోలు శక్తిపైనా, కొనుగోలు ప్రవర్తనపైనా ఇన్ఫ్లుయన్సర్ల ప్రభావం ఉంటుంది. అందుకే ఇన్ఫ్లుయన్సర్లకు కంపెనీలు డబ్బులు చెల్లించి తమ ప్రోడక్ట్స్ రివ్యూ వీడియోలు చేయమని కోరుతాయి.
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడటం ఎలా?.. డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి?
- మీడియా ద్వారా కుట్రలు కూడా చేయొచ్చా?
ఇన్ఫ్లుయన్సర్ల స్పందన ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని అండలూరు గ్రామానికి చెందిన 25 ఏళ్ల మరిడి కౌశిక్, ఆర్థిక పెట్టుబడులు, సేవింగ్స్ వంటి విషయాల్లో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పుడిపుడే ఆర్థిక పెట్టుబడుల కంటెంట్లో ఇన్ఫ్లుయన్సర్గా మారతున్న కౌశిక్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు. ఈయన ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు స్వాగతించే విషయమన్నారు. ఇన్ఫ్లూయన్సర్లు చేసే వీడియోల్లో స్పాన్సర్డ్ కంటెంట్ను, ప్రమోషనల్ వీడియోలను కచ్చితంగా ఎండార్స్ చేయాలన్నారు.
వ్లాగింగ్ ద్వారా నెలకు యాభై వేల వరకూ సంపాదిస్తున్న కౌశిక్, ఇన్ఫ్లూయన్సర్స్ చేసే కంటెంట్ను కొందరు ప్రజలు అమాయకంగా గుడ్డిగా నమ్మేస్తారని, వాళ్లలో అవగాహన పెరగాలంటే కంటెంట్ ఎండార్స్మెంట్ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
“కంటెంట్ ఎండార్స్మెంట్ ఇన్ఫ్లుయన్సర్ల బాధ్యత. మేము కంపెనీల నుంచి డబ్బు తీసుకున్నా, చేసే వీడియోలు స్పాన్సర్డ్ అయినా కచ్చితంగా పారదర్శకంగా వ్యూయర్స్కు వివరాలు చెప్పాలి” అని అన్నారు.
ఇప్పుడిపుడే తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న కౌశిక్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
- సోషల్ మీడియా ప్రభావంతో హీరోగా మారిన నిరసనకారుడు.. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- #BBCShe: రేప్ వార్తల రిపోర్టింగ్లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే కంటెంట్ బెడద
చాలా మంది షాపింగ్ చేసేముందు, కొత్త ప్రోడక్ట్స్ కొనేముందు వాటిపైన అందుబాటులో ఉన్న రివ్యూ వీడియోలు చూస్తున్నారు.
ఏదైనా హాలిడే స్పాట్కు వెళ్లాలనుకున్నా ట్రావెల్ వ్లాగర్స్ చెప్పే విషయాల కోసం వెతుకుతున్నారు. కొత్తగా ఏదైనా రెస్టారెంట్కు వెళ్లాలన్నా ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్లు చెప్పే విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.
వాళ్లు చెప్పే విషయాలనూ, అనుభవాలనూ, అభిప్రాయాలనూ తెల్సుకుంటున్నాం. అవి మనకు నచ్చితే టక్కున వాళ్లను అనుసరిస్తున్నాం. ఇలా ఏం చేయాలన్నా ముందుగా సోషల్ మీడియాలో వాటి గురించి వివరించే ఇన్ఫ్లూయన్సర్లను ఫాలో అవుతున్నాం.
అయితే ఇన్ఫ్లుయన్సర్లందరూ ఇలా చెప్పే విషయాలన్నీ కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. వాస్తవాల నుంచి తప్పుదోవ పట్టించే విధంగా ఉండొచ్చు. వాళ్లు చెప్పే ప్రోడక్ట్ రివ్యూలకు సదరు కంపెనీ డబ్బు చెల్లిస్తే ఆ విషయాన్ని తమ వీడియోల్లో చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో అధికారుల స్పందన
“మార్గదర్శకాలు రావడం మంచి విషయమే కానీ వాటి పరిధి రాష్ట్రాల స్థాయిలో లేదు. వినియోగదారుల రక్షణ చట్టం కింద ఏర్పాటైన కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు మాత్రమే ఉల్లంఘనల విషయంలో చర్యలు తీసుకునే అధికారం ఉంది.
రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వినియోగదారులకు కేసులు పెట్టే అవకాశం లేదు. కాబట్టి దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాల్సి ఉంది” అని తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామ్ కుమార్ అన్నారు.
బీబీసీ తెలుగుతో మాట్లాడిన రామ్ కుమార్, నూతన ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమేరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి అన్నారు. తమను ఇన్ఫ్లూయన్సర్లు తప్పుదోవ పట్టించే వీడియోలు చేశారన్న ఫిర్యాదులు ఇప్పటి వరకు వినియోగదారుల నుంచి అందలేదని తెలిపారు.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు, బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ మార్గదర్శకాలు బావున్నాయి కానీ వాటి అమలు, పర్యవేక్షణ అంత తేలికైన విషయం కాదన్నారు.
“ఇది కచ్చితంగా సానుకూల అంశమే కానీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వాటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కేంద్ర సంస్థ సీసీపీఏకు మాత్రమే ఇందులో అధికారాలున్నాయి. కాబట్టి మార్గదర్శకాల అమలు క్షేత్ర స్థాయిలో ఎంతమేరకు జరుగుతాయో తెలీదు” అని అన్నారు డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు.
పెరుగుతున్న డిజిటర్ మార్కెటింగ్ పరిధి
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ చాలా విస్తృతం అవుతోంది. దానికి తగ్గట్టే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లూ, డిజిటల్ ఇన్ఫ్లూయన్సర్లూ పెరుగుతున్నారు.
దాంతో సోషల్ మీడియాలో వినియోగదారులను బోల్తా కొట్టించే మార్కెటింగ్ సమాచారం, అక్రమ వ్యాపార విధానాలను అనుసరించే అడ్వర్టైజ్మెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వ
ీటి ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇలాంటి కంటెంట్ను అదుపు చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త గైడ్లైన్స్ జారీ చేస్తున్నట్టు రోహిత్ కుమార్ తెలిపారు.
'ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (ASCI) ప్రకటించిన నిబంధనలేంటి?
ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) 2021 జూన్లో డిజిటల్ మీడియాలో ఇన్ఫ్లూయన్సర్ అడ్వర్టైజింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి 2021 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇన్ఫ్లూయన్సర్లు చేసే వీడియోలు స్పాన్సర్డ్ అయినా, ప్రమోషనల్ కంటెంట్ అయినా, డబ్బు తీసుకుని రివ్యూలు చెప్పినా వాటిని వినియోగదారులు గుర్తించే విధంగా ఉండాలని ఏఎస్సీఐ స్పష్టంగా చెబుతోంది.
ప్రోడక్ట్స్ విషయంలో పెద్దగా అవగాహన లేని వినియోగదారులను ఇన్ఫ్లుయన్సర్ల ద్వారా అడ్వటైజర్లు, ఉత్పత్తిదారులు తప్పుదారి పట్టించే పోకడలను అరికట్టేందుకే కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
- స్టీవెన్ స్మిత్: ఒక బాల్కి 16 పరుగులు, ఇది ఎలా సాధ్యమైంది?
- నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?
- క్రైస్తవం: జెరూసలేంలో మొదటి మహిళా పాస్టర్ నియామకం
- వగీర్: 'శత్రువుల కంటపడకుండా సముద్రంలో కదిలే జలాంతర్గామి’
- ఖురాన్ దహనం: స్వీడన్, తుర్కియేల మధ్య మరింత ముదిరిన వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)