సరితా నాయర్ ఆత్మకథ: బాంబులు పేలుస్తుందా?
కోయంబత్తూర్: కేరళ సోలార్ స్కామ్లో ప్రధాన నిందితురాలైన సరితా నాయర్ తాను తన ఆత్మకథ రాస్తానని చెబుతున్నారు. త్వరలోనే దాన్ని విడుదల చేస్తానని చెప్పారు. అప్పటి పాలక పార్టీ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సరితా నాయర్ తన ఆత్మకథలో ఏ విధమైన బాంబులు పేలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
తమిళంలో తన జీవిత చరిత్ర రాయాలని కొంత మంది తనను అడిగారని, దాన్ని రాసే పనిలో ఉన్నానని, త్వరలో దాన్ని విడుదల చేస్తానని, తన జీవితంలోని ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయని ఆమె చెప్పారు. కొద్ది కాలంగా ఆమె కోయంబత్తూరులో ఉంటున్నారు.
సోలార్ స్కామ్ కేసుపై కూడా ఆమె స్పందించారు. కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న న్యాయవిచారణ సంఘానికి 90 శాతం సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తయి, దోషులను శిక్ష పడేలా ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం చూస్తుందనే ఆశాభావాన్ని సరితా నాయర్ వ్యక్తం చేశారు.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు. కోట్లాది రూపాయల మేరకు సరితా నాయర్, బిజూ రాధాకృష్ణన్ మోసం చేశారనేది సోలార్ ప్యానెల్ స్కామ్కు సంబంధించిన ప్రధాన అంశం. ఈ స్కామ్ రాజకీయంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది.