CJP Protest in Delhi: "ప్రధాన్ రాజీనామా చేయకపోతే.. నిరాహారదీక్ష చేపడతాం"
దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజుకు చేరాయి. నీట్-యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఓ వైపు పోలీసులు అనుమతి గడువు ముగిసినప్పటికీ అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. ఆ తర్వాత దిల్లీలోని జంతర్ మంతర్ కు చేరుకుంది.
అయితే ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులకు నీటి సరఫరా, రెస్ట్ రూమ్స్ ను దిల్లీ పోలీసులు కట్ చేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో విద్యార్థులకు దిప్కే కీలక సూచన చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక దేశంలోని 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దాదాపు 22.79 లక్షలకుపైగా మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక ఆందోళనలో భాగంగా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రం ప్రయోగించారు అభిజీత్ దీప్కే. ఓ ఆందోళనకారుడు తీసుకొచ్చిన బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ జల్ మురి ని ఆరగించారు. అలాగే నిరసనకారులకు పంచారు. జల్ మూరి తినండి ప్రధాని మోదీలా శక్తి వస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల్లో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ పాల్గొన్నారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తాము నిరాహార దీక్ష చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇక శనివారం రోజున రాత్రి వరకూ నిరసన కారులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తాము ఆందోళనలకు అనుమతి ఇచ్చామని ఆ తర్వాత నిరసనలు కొనసాగించడం చట్ట విరుద్ధమని దిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ దిప్కే కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే దిప్కే మాత్రం ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తాను జంతర్ మంతర్ వీడేది లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications