టీ బిల్లుపై చర్చ: కిరణ్ రెడ్డితో సోనియా ప్యాచప్?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సయోధ్యకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ వివాదం ముదిరినప్పటి నుంచి సోనియా గాంధీకి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య ఏ మాత్రం సయోధ్య లేకుండా పోయింది. కాంగ్రెసు అధిష్టానంతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. ఢిల్లీ వెళ్లి కూడా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారే తెప్ప అధిష్టానం పెద్దలను కలుసుకోలేదు.
ప్రస్తుతం తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ నుంచి సందేశం అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లులో నిర్దిష్టమైన సవరణలు సూచించాలని సోనియా గాంధీ అడిగినట్లు కిరణ్ కుమార్ రెడ్డికి గురువారం సమాచారం అందింది. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడొకరు ఫోన్ చేసి పదేళ్లకు లోపు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా అడిగినట్లు తెలుస్తోంది.

తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి తనకు సమయం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో శుక్రవారం వార్తుల వచ్చాయి. న్యూఢిల్లీ ధర్నా చేసిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేసి, తర్వాత వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. చర్యలు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్రలో సానుభూతి పెరుగుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.
హైదరాబాదును కొంత కాలం కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి సీమాంధ్ర కేంద్ర మంత్రులను చల్లబరచడానికి కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పల్లం రాజు, పురంధేశ్వరి వంటి కేంద్ర మంత్రులు యుటిని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని బలపరచే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి లేనట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో సయోధ్య కోసం సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు ఇస్తామని కూడా కాంగ్రెసు అధిష్టానం చెబుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications