వచ్చే ఎన్నికల్లో గెలిచి అఖిలేష్ యాదవ్ సీఎం అయితే.. కుల గణన: ఒవైసీతో పొత్తుపై ఓం ప్రకాశ్ రాజభర్
లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఆధ్వర్యంలోని తమ కూటమి వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే తాము కులాల(కుల గణన) వారీగా జనాభా లెక్కలు నిర్వహిస్తామన్నారు ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్న ఓం ప్రకాశ్ రాజ్భర్ ఆదివారం రాస్రాలో మీడియాతో మాట్లాడారు.
ఐదుగురు ముఖ్యమంత్రులు, 20 మంది డిప్యూటీ సీఎంలు రోటేషన్ విధానంలో ఐదేళ్లపాటు పాలిస్తారన్న వారి వాదనపై మీడియా ప్రశ్నించగా.. ఓం ప్రకాశ్ బదులిచ్చారు. యూపీలో భాగిదారి సంకల్ప్ మోర్చ అధికారం చేపట్టిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
యూపీలోని అధికార బీజేపీని ఓడించి.. అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఓం ప్రకాశ్ రాజ్భర్ తెలిపారు. మథురలోని శ్రీకృష్ణ మందిర నిర్మాణంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై ఓం ప్రకాశ్ రాజ్భర్ స్పందిస్తూ.. అతనో బీజేపీ చిలుక అని అన్నారు.
మథురలో శ్రీకృష్ణ మందిరం, పక్కనే మసీదు ఉంటాయి. ఇక్కడే శ్రీకృమందిరం నిర్మిస్తామని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ అన్నారు. ఆయోధ్య, కాశీతోపాటు మథురలోని భవ్య మందిరాలను నిర్మిస్తామని ఆయన చెప్పారు. మథురలో శ్రీకృష్ణుడు జన్మస్థలంగా ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. ఔరంగజేబ్ పాలన కాలంలో ఇక్కడ నిర్మించిన ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించారనే వాదనలున్నాయి.
Recommended Video
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పార్టీతో పొత్తుపై ప్రశ్నించగా.. ఎస్పీతో పొత్తుకు అతను సిద్ధమేనా? అని రాజ్భర్ అన్నారు. ఒకవేళ 100 సీట్లను ఓవైసీ డిమాండ్ చేస్తే తాము ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. కాగా, తాము వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎస్బీఎస్పీ, భాగిదారి సంకల్ప్ మోర్చతో పొత్తు పెట్టుకోవాలంటే.. తమకు 100 సీట్లను కేటాయించాల్సి ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.