అన్నాడీఎంకే 'రాజీ'కీయం: స్టాలిన్ అనూహ్య నిర్ణయం, కొత్తవ్యూహం
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ పార్టీ నేతలతో బుధవారం భేటీ అయ్యారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ పార్టీ నేతలతో బుధవారం భేటీ అయ్యారు.
పన్నీర్ సెల్వం, పళని స్వామి కలిసి పనిచేసేందుకు ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న స్టాలిన్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ను కలవాలని నిర్ణయించుకున్నారు.
మంచి పని చేశావ్: పళనికి పన్నీరు కితాబు, తగ్గిన దినకరన్, శశికళ మనస్తాపం!
బల నిరూపణ పరీక్షను మరోసారి అసెంబ్లీలో లేవనెత్తాలని ఆయన భావిస్తున్నారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ముసలం తనకు కలిసొస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు.
అన్నాడీఎంకేలోని చర్యలతో విసిగిపోయిన ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు తనకు మద్దతిచ్చే అవకాశముందని, వారిని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలనేది స్టాలిన్ సరికొత్త వ్యూహంగా తెలుస్తోంది. అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కోరినట్టు స్టాలిన్ తెలిపారు. బుధవారం తమ పార్టీ నాయకులతో పాటు గవర్నర్ ను ఆయన కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తక్షణమే శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామన్నారు.
రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ తమను ఆయన కలవనీయడం లేదని ఆరోపించారు. అంతకుముందు, మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదన్నారు.