పెన్సిల్ కోసం గొడవ.. విద్యార్దిని కొడవలితో నరికి చంపిన మరో విద్యార్ధి
క్షణికావేశం ఎంతటి ఘోరానికి దారి తీస్తుందో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు ఆ తరహా ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ పెన్సిల్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చివరికి చంపుకోవడానికి కారణమైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి మరో విద్యార్ధిని కొడవలితో కిరాతకంగా నరికి చంపడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాలయంగోట్టై ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు స్నేహితుల మధ్య పెన్సిల్ విషయంలో మనస్పర్ధలు తలెత్తాయి. దాంతో కొన్ని నెలలుగా వారిద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పాఠశాలలో మళ్లీ వారి మధ్య ఈ రోజు పెన్సిల్ కోసం గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కొడవలితో ఒక విద్యార్ధి మరో విద్యార్ధిని నరికేశాడు.

ఘటన సమయంలో మధ్యలో వచ్చి వారిని ఆపేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడిపై సైతం కూడా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం అంతా క్లాసులో విద్యార్థులు, టీచర్లు చూస్తుండగానే జరగడంతో స్కూల్ లో భయానక వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఓ పెన్సిల్ కోసం తమ బిడ్డ ప్రాణం పోయిందని విలపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇలా ఓ విద్యార్థి నరికి చంపుతాడని ఎవ్వరూ ఊహించలేరు అంటూ శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం జువెనైల్ కోర్టుకు తరలించారు. మృత విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు క్షణికావేశంలో ఇలా హింసాత్మక చర్యలకు పాల్పడటం రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications