అమానవీయం : ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో... నవజాత శిశువు అన్న కనికరం లేకుండా...
ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనుకోవడం... మగపిల్లాడైతే సంబరపడటం... పితృస్వామ్య,పురుషాధిక్య సమాజ మనస్తత్వమిది. లింగ వివక్ష లేని సమాజం సాకారం కావాలని ప్రభుత్వాలు చెప్తున్నా.. ఆ దిశగా కార్యాచరణ చేపడుతున్నా.. ఇప్పటికీ చాలామందిలో మార్పు రావట్లేదు. ఆడపిల్ల పుట్టగానే పురిట్లోనే చంపేసే ఘటనలు లేదా ఎక్కడో చెత్త కుప్పపై పడేసి వెళ్లిపోతున్న ఘటనలు ఇప్పటికీ అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది.
ఇలా వెలుగులోకి...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 85కి.మీ దూరంలో ఉన్న మీరట్ పరిధిలోని శతాబ్దినగర్ కాలనీ అది. రోడ్డుపై వెళ్తున్న పాదాచారులకు ఎక్కడో పసికందు ఏడుపు వినిపించింది. చుట్టూ చూస్తే ఎక్కడా పసిపిల్లలు లేరు. అయితే సమీపంలో ఓ మూట కనిపించడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో దగ్గరికెళ్లి ఆ మూటను విప్పగా... అందులో ఓ గోనె సంచి కనిపించింది. దాన్ని విప్పి చూడగా.. అందులో మరో గోనె సంచీ ఉంది. చివరకు అందులో ఓ నవజాత శిశువును గుర్తించారు. మొత్తం మూడు గోనె సంచులు.. గుర్తు తెలియని వ్యక్తులు ఆ నవజాత శిశువును అందులో కుక్కి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
పోలీసులు ఏమంటున్నారు...
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ శిశువును ప్యారెలాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీస్ అధికారి డా.అఖిలేశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... 'శతాబ్దినగర్ కాలనీలో ఓ నవజాత శిశువును రోడ్డు పక్కన గుర్తించినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే ఓ పోలీస్ బృందాన్ని అక్కడికి పంపించి.. శిశువును ఆస్పత్రిలో చేర్పించాం. శిశువు నెలలు నిండకముందే పుట్టినట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.' అని తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియో...
శిశువును గోనె సంచుల్లో కుక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పసికందు పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన ఆ తల్లిదండ్రుల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. మరోవైపు పోలీసులు ఆ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. గతంలోనూ ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. గతేడాది రాయ్బరేలీలోని ఓ శ్మశానంలో.. ఓ మట్టికుండలో నవజాత శిశువును ఉంచి మూడు అడుగుల లోతులో ఉన్న గుంతలో పడేశారు. లింగ సమానత్వం కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఆడపిల్లల పట్ల ఇంకా కొంతమంది తల్లిదండ్రుల ఆలోచనా ధోరణుల్లో మార్పు రాకపోవడం శోచనీయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.