సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తులో స్పీడ్: షిండే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తులో వేగం పెంచాలని తాను పోలీసులను ఆదేశించినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. థరూర్ తనకు లేఖ రాసి, దర్యాప్తును వేగంగా జరిపించాలని కోరారని, సంబంధిత వ్యక్తులతో తాను ఇది వరకే మాట్లాడానని, వారు ఆ పని చేస్తున్నారని ఆయన అన్నారు.
సోమవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా షిండే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భార్య సునంద మృతి కేసులో దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని, మీడియాలో ఉహాగానాలు తనను కలతకు గురి చేస్తున్నాయని అంటూ శశి థరూర్ హోం మంత్రి షిండేకు ఆదివారం లేఖ రాశారు.
దర్యాప్తును వేగవంతం చేసి, తొందరగా ముగించాలని, దానివల్ల సత్యం త్వరగా వెలుగు చూస్తుందని శశి థరూర్ ఆ లేఖలో అన్నారు. సునంద పుష్కర్ శుక్రవారం సాయంత్రం ఓ లగ్జరీ హోటల్లో మరణించిన విషయం తెలిసిందే.
కాగా, సునంద పుష్కర్ మత్తు పదార్థం మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికను వైద్యులు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కు సమర్పించనున్నారు.