థరూర్ వైఫ్ సునంద పుష్కర్ మృతి: క్రైమ్బ్రాంచ్కు బదలీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసును గురువారం ఢిల్లీ పోలీస్లోని క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ చేశారు. సునంద మృతిపై దర్యాప్తు జరుపుతున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) అలోక్ శర్మ విష ప్రయోగం వల్లనే సునంద మృతి చెందిందని నివేదిక సమర్పించిన రెండు రోజుల తరువాత ఈ కేసు బదిలీ అయింది.
సునందపై విష ప్రయోగం ఎలా జరిగింది? అనే విషయాన్ని తేల్చాలని, అలాగే ప్రత్యేకించి సునంద మృతి హత్యనా? ఆత్మహత్యనా? అనే విషయంపై దర్యాప్తు జరపాలని అలోక్ శర్మ ఇటీవల పోలీసులను ఆదేశించారు.
సునంద భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) వైద్యులు తమ నివేదికను అలోక్ శర్మకు సమర్పించిన విషయం తెలిసిందే. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం వల్లనే సునంద మృతి చెందిందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ పేర్కొంది.
సునంద శరీరంపై 12కు పైగా గాయాలున్నట్లు కూడా పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె భుజం, చేయి, గడ్డం, మెడ భాగాల వద్ద ఈ గాయాలున్నట్లు పేర్కొన్నారు. అంటే ఏదో ఘర్షణ జరగడం వల్లనే ఈ గాయాలయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.