ఇక్కడ కేసులను సాకుగా చూపి అక్కడ: మాల్యాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: చట్టపరమైన ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న దివాలా కేసును సాకుగా చూపరాదని సుప్రీంకోర్టు లిక్కర్ బ్యారన్ విజయ్మాల్యాకు సూచించింది. దివాలాకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున లండన్ కోర్టు ఎలాంటి తీర్పు చెప్పరాదంటూ విజయ్ మాల్యా కోరడం తగదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తుషార్ మెహతా వాదనలతో అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
2011 నుంచి బకాయిలు పడ్డ సొమ్మును చెల్లిస్తామని నిత్యం చెబుతూ వచ్చారని అయితే ఇప్పటి వరకు ఒక్క పైసా చెల్లించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా. కేసును విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. మాల్యా కేసును చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ విచారణ చేసింది.
సుప్రీంకోర్టులో దివాలాకు సంబంధించి కేసు పెండింగ్లో ఉన్నందున దీన్నే ఆయుధంగా మలుచుకుని లండన్ కోర్టు తనను విచారణ చేయరాదంటూ విజయ్ మాల్యా కోరాడు. అంతకుముందు గతేడాది జూన్ 27న తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులను జప్తు చేయరాదంటూ సుప్రీంకోర్టును విజయ్ మాల్యా ఆశ్రయించారు. ఇక లండన్లో ఉన్న విజయ్ మాల్యాను భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాల్యా యూకే కోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చేవరకు యూకే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని తన పిటిషన్లో మాల్యా కోరాడు. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు యూకే కోర్టులో వాదనలు జరగనున్నాయి.
మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై వేసిన కేసులో తీర్పును యూకే కోర్టు రిజర్వ్లో ఉంచింది. మాల్యా పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో అతనిపై దివాలా ఉత్తర్వులను ఇవ్వాలని కోరుతూ ఎస్బీఐ యూకే కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మొత్తం 9వేల కోట్ల మేరా రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా దేశం విడిచి లండన్కు పారిపోయి మాల్యా తలదాచుకుంటున్నాడు. యూకేలో ఈ కేసుతో పాటు భారత్కు అప్పగించడంపై ఉన్న కేసును కూడా ఎదుర్కొంటున్నాడు.