కరోనా పరీక్షల ధరల్లో వ్యత్యాసం ఎందుకు? దేశమంతా ఒకేలా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్దారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరల్లో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. అంతేగాక, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

వాటిలో సుప్రీం జోక్యం చేసుకోదు..
కరోనా పరీక్షల ధరల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉందని, దేశమంతా ఒకే ధర అమలయ్యేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం పరిధిలోని వ్యవహారాలపై కోర్టు జోక్యం చేసుకోదని, ఎంత ధరను వసూలు చేయాలనేది కోర్టు నిర్ణయించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

పలు రాష్ట్రాల్లో తగ్గిన పరీక్షల ధరలు..
మే నెలలో భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కరోనా పరీక్షల కిట్ల ధరలు దిగిరావడంతో గతంలో నిర్ణయించిన రూ. 4500 ధరపై పరిమితులను ఎత్తివేసింది. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రైవేటు ల్యాబోరేటరీల్లో నమూనాలను పరీక్షించేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలను వసూలు చేయాలని సూచించింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ప్రాంతాల్లో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా కరోనా పరీక్షల ధరను రూ. 2,200గా నిర్ణయించినట్లు ఆయా రాష్ట్రాల వైద్య మంత్రులు వెల్లడించిన విషయం తెలిసిందే.
Recommended Video

దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండాలి..
కాగా, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ కరోనా పరీక్షల ధరలను రూ. 4500 నుంచి 2400లకు తగ్గిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్, ఐసోలేషన్ బెడ్లు, చికిత్స ధరలను కూడా తగ్గించింది. ఇలా దేశంలో ఆయా ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉండటాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications