ఆధార్ అన్నిటికీ ఆధారమా: ఆధార్పై కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: ఆధార్ పై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. అన్నిటికీ ఆధారే ఆధారమన్న కేంద్ర ప్రభుత్వ వాదనలను ఇప్పటికే సుప్రీంకోర్టు వినింది. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అన్నిటికీ ఆధార్ అవసరమన్న కేంద్ర ప్రభుత్వం వాదనపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు 38 రోజుల పాటు సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణ చేసింది. ఈ కేసుకు సంబంధించి 30 పిటిషన్లు దాఖలయ్యాయి. మేలో వాదనలు పూర్తికాగా తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.
అన్నిటికీ ఆధార్ లింక్ చేయడమెందుకు
ఆధార్ ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తోందని ముందుగా పిటిషన్ దాఖలైంది. ఒక వ్యక్తికి సంబంధించి వేలిముద్రలు, ఐరిస్, ఇతరత్రా సమాచారం తమ అనుమతి లేకున్నా తీసుకోవడం జరుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఆధార్ పై విమర్శలను తిప్పికొట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ నెంబర్తో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపింది. బ్యాంక్ ఖాతాలకు, మొబైల్ ఫోన్ నెంబర్లకు, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్కు ఆధార్ నెంబర్ అనుసంధానం అవడం వల్ల ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరగవని చెబుతూనే.. ఈ నెంబర్ అనుసందానం చేస్తే నల్లమనీ, మనీలాండరింగ్ లాంటి ఆర్థిక నేరాలకు చెక్ పెట్టొచ్చని కేంద్రం కోర్టుకు వివరించింది.
వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు 2017లో ఆధార్ పై వాదనలు జరుగుతున్న సమయంలో వ్యాఖ్యానించింది. దీంతో ఆధార్పై విమర్శలు గుప్పిస్తూ దీనివల్ల పౌరుల వ్యక్తిగత విషయాలు, గోప్యతగా ఉండాల్సిన వివరాలపై దృష్టి సారించే అవకాశం ఉందని వాదిస్తున్న విమర్శకుల్లో కొంత ఆశ చిగురించింది. 2018 మార్చిలో యూఐడీఏఐ ఛైర్మెన్ నాలుగు గంటలపాటు కోర్టుకు ఆధార్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది. అయితే కోర్టు మాత్రం వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కదనే గ్యారెంటీ ఏముందంటూ ప్రశ్నించింది.
మొత్తానికి ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తన పదవీకాలం ముగిసేలోగా ఆధార్కు సంబంధించి మరో కీలక తీర్పును బుధవారం ఇవ్వనున్నారు.