ఆ వ్యాఖ్యలేంటి ? అమిత్ షాపై సుప్రీంకోర్టు అసంతృప్తి..!
కర్నాటకలో బీజేపీ సర్కార్ ఎన్నికలకు రెండు నెలల ముందు ముస్లింలకు నాలుగు దశాబ్దాలుగా ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఈ నిర్ణయంపై విచారణ జరుగుతోంది. ఆ లోపు కర్నాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేష్లను తొలగిస్తామంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ అభ్యంతరం తెలిపింది.
కర్నాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన కేసుపై ఓవైపు విచారణ జరుగుతుండగానే.. రాజకీయ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వు ఉన్నప్పుడు మరింత పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ముస్లింలకు ఓబీసీ కేటగిరీలో దశాబ్దాలుగా ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జూలైకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది.

కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని, వాటికి రాజకీయాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొంది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన ప్రకటనపై పిటిషనర్లు ఫిర్యాదు చేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ.. ముస్లింలకు తమ పార్టీ కోటాను ఉపసంహరించుకున్నట్లు షా గర్వంగా చెబుతున్నారని అన్నారు.

విషయం కోర్టు పరిధిలో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎవరైనా ఎందుకు చేయాలి?" అని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం, కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు.ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్కు వ్యతిరేకమని చెబితే, అది పూర్తిగా సమర్ధించుకునే అంశమని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహతా వాదించారు. ఆ తర్వాత కోర్టు క్రమశిక్షణను కొనసాగించాలని కోరింది.












Click it and Unblock the Notifications