అవి చాలవు.. మరో అఫిడవిట్ ఫైల్ చేయండి: కేంద్రానికి, NTA కు సుప్రీంకోర్టు నోటీసులు
నీట్ యూజీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా సంస్థాగతమైన సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థకు సూచించింది. ఈ దిశగా చేపడుతున్న సంస్కరణల పురోగతిపై సమగ్ర నివేదికతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఆదేశించాలు ఇచ్చింది.
గతంలో జరిగిన పేపర్ లీకేజీ ఘటనల అనంతరం రవాణా భద్రత కోసం వైమానిక దళం హెలికాప్టర్లను ఉపయోగించడాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. పరీక్షా పత్రాల తరలింపు కోసం సైన్యాన్ని రంగంలోకి దించడం అనేది అప్పటికప్పుడు తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమేనని, సాంకేతికంగా దీన్ని శాశ్వత పరిష్కారంగా భావించలేమని బెంచ్ తేల్చి చెప్పింది. ఏటేటా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, స్వతంత్రంగా పనిచేసే విధానాలను తీసుకునిరావాలని పేర్కొంది.

పరీక్షల సంస్కరణల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికార కమిటీ సిఫార్సుల అమలు తీరుపై ఈ బెంచ్ ఆరా తీసింది. భద్రతను పటిష్టం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, సమాచార పారదర్శకత, పరిశోధన, అభివృద్ధి, పరిపాలన, మానవ వనరుల పెంపుతో కూడిన 10 కీలక విభాగాల్లో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించింది. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రతిపాదించిన గవర్నింగ్ బోర్డు, నిపుణుల ప్రత్యేక విభాగాల ఏర్పాటుపైనా వివరణ కోరింది.
పరీక్షా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి దశలోనూ మార్పులు ప్రతిపాదించాలని బెచ్ సూచించింది. ప్రీఎగ్జామ్, పరీక్ష జరుగుతున్న సమయంలో గానీ, ఆ తర్వాత గానీ భద్రతాపరంగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలను సమర్పించాలని పేర్కొంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణ పద్ధతులు, విభిన్న సెషన్ల ద్వారా నిర్వహణ సాధ్యసాధ్యాలపై కూడా స్పష్టత ఇవ్వాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
ఇకపై సంప్రదాయ పెన్ అండ్ పేపర్ పద్ధతి నుంచి ఆధునిక కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ విధానంలోకి మారే ప్రతిపాదనలు, డేటా రక్షణ కోసం తీసుకుంటున్న భద్రతా పరిరక్షణ చర్యల వివరాలను సైతం సుప్రీంకోర్టు తమకు సమర్పించాలని సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను గుర్తించడానికి డిజీయాత్ర వంటి అత్యాధునిక సాంకేతికతను అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది.
ఇదివరకు కేంద్రం అందజేసిన అఫిడవిట్ లో ఈ కీలక పరిణామాలను పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తపరిచింది. దీనిపై ప్రభుత్వం తరఫున స్పందించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు. వాటన్నింటి వివరాలతో కూడిన నూతన అఫిడవిట్ను సమర్పిస్తామని అన్నారు. నీట్ పరీక్షల విధానంలో ఆశించిన మార్పులు వచ్చేలా తాము ఈ ప్రక్రియను ఏడాది పొడవునా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications