26 ఏళ్ల తర్వాత భర్తకు దక్కిన న్యాయం! మీర్జాపూర్ కేసులో సుప్రీం సంచలన తీర్పు..
వరకట్నం వేధింపుల కేసుల్లో కేవలం బంధుత్వం ఉందనే ఒకే ఒక్క కారణంతో కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా నిందితులుగా మార్చడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 26 ఏళ్ల క్రితం నాటి ఒక వరకట్న వేధింపులు, మహిళ మృతి కేసును విచారించిన సుప్రీంకోర్టు.. భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మృతురాలికి జరిగిన ప్రమాదాన్ని కావాలనే హత్యగా చిత్రీకరిస్తూ, ఒకే కుటుంబానికి చెందిన 17 మందిపై కేసు నమోదు చేయడాన్ని 'న్యాయాన్ని హాస్యాస్పదం చేయడమే' అని కోర్టు అభివర్ణించింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
పాతికేళ్ల క్రితం ఏం జరిగింది?
ఈ కేసు నేపథ్యం చూస్తే.. ఉత్తరప్రదేశ్ పరిధిలోని మీర్జాపూర్లో 2000 సంవత్సరంలో ఒక వివాహిత తన అత్తవారింట్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో 40 శాతం మేర కాలిపోయి, చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కింద రూ. 50,000 డిమాండ్ చేస్తూ తన కూతురిని వేధించి చంపేశారంటూ భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచులు, బావమరుదులు.. ఇలా మొత్తం 17 మంది బంధువుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాడు.

విచారణలో గందరగోళం.. హైకోర్టు తీరుపై అసహనం
పోలీసులు ఈ కేసులో మొదట అత్తమామలపై చార్జ్షీట్ వేసి, మిగిలిన 15 మందిపై విచారణ కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు విచారణల్లో అత్తమామలతో పాటు మిగిలిన 14 మంది బంధువులు నిర్దోషులుగా తేలి విముక్తి పొందారు. కానీ, కింది కోర్టు కేవలం భర్తను మాత్రమే దోషిగా తేల్చింది. దీనిపై దాఖలైన అప్పీలును పట్నా హైకోర్టు సరిగ్గా పరిశీలించకుండా, కేవలం సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదనే చిన్న సాంకేతిక కారణంతో కేసును మళ్లీ కింది కోర్టుకు పంపింది.
పాతికేళ్ల క్రితం నాటి కేసును ఇలా అజాగ్రత్తగా హ్యాండిల్ చేయడం, అనవసరంగా విచారణను పొడిగించడం సరికాదని హైకోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
నిజ నిజాలు తేల్చిన సుప్రీంకోర్టు!
ఈ కేసు రికార్డులను సుప్రీంకోర్టు స్వతంత్రంగా పూర్తిగా పరిశీలించింది. మృతురాలు చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇతర ఆధారాలను పరిశీలించగా.. ఆమె వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గాయపడినట్లు స్పష్టమైంది. కట్నం కోసం వేధించినట్లు గానీ, హింసించినట్లు గానీ ప్రాసిక్యూషన్ ఎలాంటి నమ్మదగిన ఆధారాలను కోర్టు ముందు నిరూపించలేకపోయింది.
సరిగ్గా నిరూపించలేని ఆరోపణలతో ఒక వ్యక్తిని దోషిగా ఉంచలేమని స్పష్టం చేస్తూ, భర్తపై ఉన్న శిక్షను రద్దు చేసి అతడిని సుప్రీంకోర్టు తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. కేవలం పెళ్లి బంధంతో ముడిపడి ఉన్నారనే కారణంతో బంధువులందరినీ కోర్టు బోనులో నిలబెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని ఈ సందర్భంగా న్యాయస్థానం గట్టిగా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications