శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శుక్రవారం కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: వరుస తీర్పులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బిజీగా ఉన్నారు. తాను పదవీవిరమణ చేసే నాటికి చాలా కీలక కేసులపై తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 377, ఐపీసీ సెక్షన్ 497లు రాజ్యాంగ విరుద్ధమని కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా... అయోధ్యపై కూడా కీలక తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరో చారిత్రక తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. అదే కేరళలోని శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశం.
గుడ్ న్యూస్: శబరిమలై ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించొచ్చన్న సుప్రీంకోర్టు
ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేరళలోని శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంకు సంబంధించి దాఖలైన పిటిషన్ను ఆగష్టులోనే విచారణ చేసింది. తీర్పును సెప్టెంబర్ 28కి రిజర్వ్ చేసింది. అంతకుముందు జూలై నెలలో ఆలయాల్లో మహిళలకు ప్రార్థనలు లేదా పూజలు చేసే సమాన హక్కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఇందుకు సంబంధించి ఏ చట్టం చేయరాదని పేర్కొంది. మహిళలకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని ఆలయ అధికారులను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే అందులోకి ఎవరైన ప్రవేశించే హక్కు ఉందని జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు.
ఆలయ అధికారులు పురుషులను లోపలికి ప్రవేశం కల్పిస్తుండగా.. మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని సూచించారు. ప్రైవేట్ ఆలయం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదన్నారు. ఆలయం అనేది అంటూ ఒకటి ఉంటే... అందులోకి ఎవరికైనా ప్రవేశం ఉంటుందన్నారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు కోర్టుకు నివేదిక జూలై 18న అందజేసింది. గతేడాది అక్టోబర్లో శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంకు సంబంధించి విచారణ చేసేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యింది.
800 ఏళ్లుగా మహిళలకు శబరిమలై ఆలయంలోకి ప్రవేశం లేదని దీనిపై విచారణ చేసి మహిళలకు ఎంట్రీ కల్పించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్ అసోసియేషన్ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు, ప్రధాన అర్చకుడు, శబరిమలై ఆలయ అధికారులు, పటానంతిట్ట జిల్లా కలెక్టర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.