ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు-సుప్రీం విచారణ పూర్తి-తీర్పు రిజర్వ్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ లావునాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారణ జరిపింది. వివిధ రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు.
దాదాపు 75 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని అగ్రవర్ణాల స్థాయికి తీసుకురాలేదన్నది జీవిత సత్యమని జస్టిస్ జస్టిస్ లావునాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం గతంలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు గ్రూప్ ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు పొందడం చాలా కష్టమని, ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వారికి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన ప్రాతిపదికను కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు.
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు)కు పదోన్నతిలో రిజర్వేషన్ల మంజూరు అంశంపై తన నిర్ణయాన్ని తిరిగి తెరవబోమని బెంచ్ ఇంతకుముందు పేర్కొంది. అలాగే వాటిని ఎలా అమలు చేయబోతున్నారో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. వీటిని విన్న తర్వాత విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తుది తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ తీర్పు వెలువడే అవకాశముంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై చర్చ సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఈ తీర్పు కీలకంగా మారింది. గతంలో రిజర్వేషన్లపై పలు చర్చలు సాగడం, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో .. కేంద్రం, రాష్ట్రాల వాదన ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వబోతోంది.